ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఉద్యోగ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

national |  Suryaa Desk  | Published : Wed, Aug 13, 2025, 02:18 PM

ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలవుతున్న రిజర్వేషన్ల విధానంలో కీలక మార్పులు కోరుతూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రిజర్వేషన్ల ప్రయోజనాలు ఆయా వర్గాల్లోని అత్యంత నిరుపేదలకు మాత్రమే అందేలా ఆర్థిక ప్రాతిపదికను చేర్చాలని ఈ పిటిషన్‌లో కోరారు. ఈ వ్యాజ్యంపై స్పందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం నిన్నఈ పిల్‌ను విచారణకు స్వీకరించింది. రామశంకర్ ప్రజాపతి, యమునా ప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై అక్టోబర్ 10వ తేదీలోగా తమ స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ పిల్‌పై తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది సందీప్ సింగ్‌కు ధర్మాసనం సూచించడం గమనార్హం.షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) చెందిన పిటిషనర్లు తమ వ్యాజ్యంలో కీలక అంశాలను ప్రస్తావించారు. "గత 75 ఏళ్లుగా అమలవుతున్న రిజర్వేషన్ల వల్ల ఆయా వర్గాల్లోని కొద్దిమంది, ఆర్థికంగా మెరుగ్గా ఉన్నవారే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల నిజంగా సాయం అవసరమైన అత్యంత నిరుపేదలు అవకాశాలకు దూరంగా ఉండిపోతున్నారు" అని వారు వాదించారు.ప్రస్తుత రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేయాలని తాము కోరడం లేదని, దానిని మరింత మెరుగుపరిచి, అసలైన లక్ష్యం నెరవేరేలా చూడాలన్నదే తమ ఉద్దేశమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలో ఆదాయ పరిమితిని ఒక ప్రాతిపదికగా చేర్చడం ద్వారా, ఆయా వర్గాల్లోని నిరుపేదలకు ఉద్యోగ అవకాశాల్లో మొదటి ప్రాధాన్యం లభిస్తుందని వివరించారు. ఈ సంస్కరణ రాజ్యాంగంలోని 14, 15, 16 అధికరణాలను బలోపేతం చేస్తుందని వారు తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ల ఫలాలు కింది స్థాయిలోని అర్హులకు చేరాలన్నదే తమ పిటిషన్ ముఖ్య ఉద్దేశమని వారు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa