ఆంధ్రప్రదేశ్ను ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్’గా తీర్చిదిద్దాలని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అదే సమయంలో, విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగదారులపై ఎలాంటి భారం మోపవద్దని ఆయన స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ సరఫరా, పెట్టుబడులు, ఛార్జీల తగ్గింపు వంటి కీలక అంశాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఏపీ ట్రాన్స్కో, జెన్కో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర విద్యుత్ రంగంలో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. "భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, ఆ ప్రయోజనాలను ప్రజలకు అందించాలి," అని ఆయన పేర్కొన్నారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 8.9% పెరిగే అవకాశం ఉందని, ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేసే మార్గాలను అన్వేషించాలని అన్నారు.వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన సీఎం, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్కో ఆధీనంలో ఉన్న ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ను లీజుకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం సంపాదించవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా దాదాపు రూ.7 వేల కోట్ల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని అంచనా వేశారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించాలని, యూనిట్ కొనుగోలు వ్యయాన్ని రూ.4.80కి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎస్ విజయానంద్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు.రాష్ట్రంలో 9 శాతంగా ఉన్న విద్యుత్ పంపిణీ నష్టాలను గణనీయంగా తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఫీడర్లను సమర్థవంతంగా నిర్వహించడం, స్థానికంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను అక్కడే వినియోగించడం ద్వారా ట్రాన్స్మిషన్ నష్టాలను అరికట్టవచ్చని అన్నారు. గతంలో తాను ప్రవేశపెట్టిన ఎనర్జీ ఆడిటింగ్ విధానాన్ని మళ్లీ అమలు చేసి విద్యుత్ చౌర్యాన్ని, నష్టాలను గుర్తించాలని సూచించారు. పెరిగే డిమాండ్ను ఎదుర్కొనేందుకు విద్యుత్ కొనుగోళ్లకు బదులుగా 'పవర్ స్వాపింగ్' వంటి విధానాలను అనుసరించాలని తెలిపారు.థర్మల్ విద్యుత్ యూనిట్కు రూ.5 నుంచి రూ.6 ఖర్చవుతుండగా, పవన విద్యుత్కు కేవలం రూ.4.6 మాత్రమే వ్యయం అవుతోందని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రంలో 65 గిగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయని, ఆ దిశగా ప్రాజెక్టులను ప్రోత్సహించాలని అన్నారు. రాయలసీమలో పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టులకు విస్తృత అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పీఎం-సూర్యఘర్ సోలార్ రూఫ్ టాప్ పథకాన్ని వేగవంతం చేయాలని, ప్రతి నియోజకవర్గంలో కనీసం 10 వేల ఇళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ పథకం పురోగతిపై ప్రతినెలా తానే స్వయంగా సమీక్షిస్తానని స్పష్టం చేశారు.అలాగే, వ్యవసాయానికి ఎక్కడా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని సీఎం చంద్రబాబు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. పాతబడిన విద్యుత్ లైన్లను గుర్తించి, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ‘ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్’ టెక్నాలజీని వాడాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa