ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుళ్లూరు పర్యటనలో,,,బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 13, 2025, 07:57 PM

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.గుంటూరు జిల్లా తుళ్లూరులో పర్యటించిన నందమూరి బాలకృష్ణ.. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన బాలకృష్ణ.. ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాభివృద్దే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే టీడీపీ సిద్ధాంతమన్న బాలకృష్ణ.. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ నెలకు నాలుగువేలు పింఛన్ ఇస్తున్నామని వెల్లడించారు.


టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజల తలసరి ఆదాయాన్ని కూడా పెంచామన్న బాలకృష్ణ.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కొంతమంది వ్యక్తులు రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని, ఖజానా ఖాళీ చేసారని విమర్సించారు. సమయం వచ్చినపుడు అలాంటి వారి తాట తీస్తామని హెచ్చరించారు. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీపైనా, ప్రభుత్వంపైనా దుష్ర్పచారం చేసే వారి తలలు తీసేస్తామంటూ బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


మరోవైపు అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి బుధవారం నందమూరి బాలకృష్ణ భూమి పూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడిన బాలయ్య.. రోగులకు అందిస్తున్న సేవలకు గానూ బసవతారకం ఆస్పత్రికి ఎన్నో అవార్డులు వచ్చాయని అన్నారు. ఈ ఆస్పత్రి లాభాల కోసం కాదని.. దాతల సహకారంతో నడుస్తోందని అన్నారు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఐదేళ్ల కిందటే శంకుస్థాపన చేశామన్న బాలకృష్ణ..వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించిందని ఆరోపించారు. దీంతో బసవతారకం ఆస్పత్రి నిర్మాణ పనులలో జాప్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక పనులు మొదలుపెట్టామని.. అందులో భాగంగానే ఆస్పత్రి నిర్మాణం కోసం భూమి పూజ చేసినట్లు తెలిపారు.


మరోవైపు క్యాన్సర్ చికిత్సను తక్కువ ఖర్చుతో అందించాలనే తన తల్లి కోరిక మేరకు బసవతారకం ఆస్పత్రి ద్వారా అత్యున్నత వైద్యాన్ని అందిస్తున్నామని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం మొదటి విడతలో రూ.750 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు బాలయ్య వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు, దాతలు ఇందులో భాగస్వామ్యులు అవుతున్నారని.. 2028లోగా మొదటి విడత పనులు పూర్తి చేసి ఆస్పత్రి సేవలు అందుబాటులోకి తెస్తామని బాలకృష్ణ వివరించారు. క్యాన్సర్ రోగులకు చికిత్సతో పాటుగా క్యాన్సర్ మీద పరిశోధనలు జరిగేలా ఈ ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించనున్నట్లు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa