వైసీపీ అధినేత జగన్ పై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కనీసం వంగి కొబ్బరికాయ కొట్టలేని జగన్, నిరంతరం ప్రజాసేవలో ఉండే చంద్రబాబు వయసు గురించి మాట్లాడడమా అంటూ ఎద్దేవా చేశారు. బుధవారం నాడు నెల్లూరులో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి, జగన్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు."గత 30 ఏళ్లలో తొలిసారిగా పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు వేసి, పోలింగ్ నిర్వహించే పరిస్థితి వచ్చింది. తమ కంచుకోటలో ప్రజాస్వామ్యం బతకడాన్ని చూసి ఓర్వలేక పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఒళ్లు బలిసి మాట్లాడుతున్నారు. ఇవే చివరి ఎన్నికలు అని, కృష్ణారామ అని జపం చేసుకోవాలని, నరకానికి పోతారని అంటూ చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారు" అని సోమిరెడ్డి ఆరోపించారు. వైసీపీ పాలనలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో అరాచకాలు సృష్టించి, ప్రతిపక్షాలు నామినేషన్లు కూడా వేయలేని దుస్థితి కల్పించారని ఆయన గుర్తుచేశారు.చంద్రబాబు క్రమశిక్షణ, కష్టపడే తత్వానికి మారుపేరని, ఆయన రోజుకు 12 గంటలకు పైగా రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తారని సోమిరెడ్డి తెలిపారు. "రాముడు, కృష్ణుడు లోకకళ్యాణం కోసం తపించినట్లే, చంద్రబాబు కూడా నిత్యం ప్రజల కోసమే పోరాడుతున్నారు. అలాంటి వ్యక్తి పేరు పలికే అర్హత కూడా జగన్కు లేదు" అని ఆయన అన్నారు. లిక్కర్ స్కామ్పై సిట్ దర్యాప్తులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుండటంతో గందరగోళానికి గురైన జగన్, నోటిపై అదుపు కోల్పోతున్నారని విమర్శించారు."రాజకీయాల్లోకి రావాలంటే తండ్రి చనిపోవాలి, సీఎం కావాలంటే చిన్నాన్న హత్యకు గురికావాలి ఇదే జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహం. ప్రజాసేవలో అపార అనుభవం ఉన్న చంద్రబాబు బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? జగన్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అని సోమిరెడ్డి ప్రశ్నించారు. జగన్ రెడ్డి, ఆయన అనుచరులు ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఒళ్లు బలిసిన వారి సంగతిని లోకేశ్ చూసుకుంటారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa