వైసీపీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న 'ఓట్ల చోరీ' ఆరోపణలపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఎన్నికల్లో ఓటమికి సాకులు వెతకడం మానుకోవాలని, 'నోట్ల చోరీ' వల్లే ప్రజలు వైసీపీని తిరస్కరించారని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన సోషల్ మీడియా వేదికగా జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.తమ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలతోనే నిజమైన 'హాట్లైన్' ఉందని లోకేశ్ అన్నారు. పదేపదే తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు. "ఓట్ల చోరీ జరిగిందని చెప్పడం కాదు వరుస కుంభకోణాల్లో మీరు చేసిన నోట్ల చోరీ వల్లే ఓడిపోయారు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు బాగా తెలుసు" అంటూ లోకేశ్ పరోక్షంగా మద్యం స్కామ్లను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్ర ప్రగతికి కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. "మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ను మళ్లీ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెడతాం" అని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా, నిరాధార ఆరోపణలు చేయడం తగదని ఆయన జగన్కు హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa