జమ్మూ కాశ్మీర్ కొండల్లో గురువారం సంభవించిన క్లౌడ్ బరస్ట్ పదుల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకున్న సంగతి తెలిసిందే.. కిష్త్వార్ జిల్లాలోని మచైల్ మాతా దేవి మార్గంలో వెళ్తున్న యాత్రికులపై ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో క్రమ క్రమంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ ప్రకృతి ప్రకోపంలో చనిపోయిన వారి సంఖ్య 60 దాటినట్లు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. మరో 100 మందికిపైగా గాయాలపాలైనట్లు తెలిపారు. ఇక ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో దాదాపు 1200 మంది ఉన్నారని స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వందల మంది ఆ వరదల్లో కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.
ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారిని గుర్తించేందుకు.. రెండోరోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి.. క్లౌడ్ బరస్ట్ పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు వెల్లడించారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని.. పేర్కొంటున్నారు. సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగంగా చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్లను రంగంలోకి దించడం వీలు పడటం లేదని అధికారులు వెల్లడించారు.
జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, స్వచ్ఛంద సంస్థలతోపాటు దాదాపు 300 మంది సైనిక బృందం ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు లభ్యమైన 60కి పైగా మృతదేహాల్లో 21 మందిని గుర్తించినట్లు అధికారులు స్పష్టం చేశారు. గురువారం జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్ జిల్లాలోని మచైల్ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులు.. నది దాటుతుండగా.. ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంది. దీంతో ఆకస్మిక వరదలకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతయ్యారు. నదికి ఇరువైపులా ఉన్న బిల్డింగ్లు, దుకాణాలు కుప్పకూలిపోయాయి. ఇక క్లౌడ్ బరస్ట్ కారణంగా మచైల్ మాతా దేవి యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa