ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ కార్డు దగ్గరి నుంచి బస్ టికెట్ల వరకు.. వాట్సాప్‌లోనే 50 రకాల సేవలు

national |  Suryaa Desk  | Published : Fri, Aug 15, 2025, 08:36 PM

ప్రస్తుత డిజిటల్ యుగంలో అన్ని పనులు అరచేతిలో ఉన్న సెల్‌ఫోన్‌తోనే చేసుకునే వీలు కలుగుతోంది. మనకు ఏది కావాలన్నా.. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. ఒక్క క్లిక్‌తో అన్ని సేవలను పొందే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ సేవల కోసం ప్రభుత్వ ఆఫీసులకు తిరగాల్సిన పని లేకుండా.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు దగ్గరి నుంచి మొదలుపెడితే.. ఆర్టీసీ బస్ టికెట్ల వరకు అన్ని సేవలను వాట్సాప్‌లోనే అందించాలని నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో భాగంగా మొత్తం 50 రకాల సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం వాట్సాప్‌ మాతృసంస్థ అయిన మెటాతో తమిళనాడులోని డీఎంకే సర్కార్ ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రానున్న 3 నెలల్లో ఈ వాట్సాప్ సేవలు తమిళనాడు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


రాష్ట్ర ప్రభుత్వం అందించే సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించేందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్‌ కార్డు నుంచి బస్‌ టిక్కెట్ల వరకు తొలి దశలో 50 సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు ఫేస్‌బుక్‌ మాతృసంస్థ అయిన మెటాతో తమిళనాడు ప్రభుత్వం తాజాగా ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇంగ్లీష్‌తోపాటు తమిళ భాషల్లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని ఉపయోగించుకుని.. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించనున్నారు.


ప్రభుత్వం నుంచి ఏ రకమైన సర్వీసు కావాలో దానికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను వాట్సాప్‌లో అప్‌లోడ్ చేసి.. దానికి సంబంధించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తును ప్రభుత్వ అధికారులు పరిశీలించి.. నిర్ణీత సమయంలో దానికి పరిష్కారాన్ని అందిస్తారు. దీనివల్ల ప్రజలు.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని తప్పనుందని తమిళనాడు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


అయితే తమిళనాడులో ఈ వాట్సాప్ సేవలు వచ్చే 3 నెలల్లో ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆ రాష్ట్ర మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ ఈ విషయాన్ని చెప్పారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు వీలుగా మెటా సంస్థతో తమిళనాడు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇక వాట్సాప్ సర్వీసుల నేపథ్యంలో ప్రజల సెక్యూరిటీ పరంగా ఓటీపీతో పాటు మరికొన్ని చర్యలను చేపట్టనున్నారు.


ఇక ఈ వాట్సాప్ ద్వారా తమిళనాడు ప్రజలు.. రేషన్‌ కార్డు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పన్ను చెల్లింపులు, వాణిజ్య అనుమతులు పొందడం, బస్ టికెట్ల రిజర్వేషన్‌, రేషన్‌ కార్డుల్లో అడ్రస్ మార్పులు, ఆదాయ ధృవపత్రం, ఫస్ట్‌గ్రేడ్‌ డిగ్రీ సర్టిఫికెట్‌, మెట్రో వాటర్‌ బిల్లు చెల్లింపులు, ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపులు, డ్రైనేజీ పన్ను చెల్లింపులు.. రేషన్‌ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను తొలగించడం, చేర్చడం వంటి సుమారు 50 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సేవలు విజయవంతంగా ప్రజలకు అందితే.. ఆ తర్వాత మరిన్ని సేవలను కూడా ప్రవేశపెట్టేలా తమిళనాడు ఆన్‌లైన్‌ సేవల విభాగం కీలక చర్యలు తీసుకుంటోంది.


తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ-సేవా కేంద్రాల ద్వారా లభించే 35,843 సేవలను వాట్సా్‌ప్ ద్వారానే ప్రజలకు అందించేలా స్టాలిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఈ సరికొత్త ప్రయత్నం వల్ల.. ప్రభుత్వం అందించే సేవలను ప్రజలు మరింత సులభంగా పొందే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. వాట్సా్‌ప్‌లో ఏ సమయంలోనైనా.. ఎలాంటి సేవనైనా సులభంగా పొందవచ్చని చెబుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా.. అనేక రకాల సేవలను ప్రజలుక సులభంగా అందిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa