ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశం కోసం చివరి శ్వాస వరకు పని చేస్తా: ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్

national |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 07:31 PM

భారత రాజకీయాల్లో కీలకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలోనే అధికార భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ).. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. తనను ఈ ప్రతిష్టాత్మక పదవికి ఎంపిక చేసినందుకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. దేశ సేవ చేసేందుకు తనకు అరుదైన అవకాశం లభించిందని ఉద్వేగభరిత పోస్ట్ చేశారు.


తనకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, అలాగే పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశం కోసం తన చివరి శ్వాస వరకు నిస్వార్థంగా, కష్టపడి పని చేస్తానని సీపీ రాధాకృష్ణన్ తన సందేశంలో పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చకు దారితీశాయి. కచ్చితంగా ఆయనే కాబోయే ఉపరాష్ట్రపతి అంటూ అంతా అభిప్రాయ పడుతున్నాడు.


67 ఏళ్ల వయసున్న సీపీ రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన ఓబీసీ వర్గానికి చెందినవారు. సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీలో పని చేసిన రాధాకృష్ణన్.. సంఘ్ పరివార్‌తో కూడా బలమైన అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. ఆయన గతంలోనే రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అలాగే 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రాజకీయ అనుభవం, నిబద్ధత, నిస్వార్థ సేవను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు జార్ఖండ్ గవర్నర్‌గా, తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు.


రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ప్రకటించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. రాధాకృష్ణన్ ఒక నిస్వార్థ, నిజాయితీపరుడైన నాయకుడని అన్నారు. ఆయన రాజ్యాంగ పదవికి పూర్తి అర్హుడని పేర్కొన్నారు. రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలని కూడా ఆయన అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. రాధాకృష్ణన్ రాజకీయ జీవితం, పాలనా అనుభవం, పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa