ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాధితురాలిపై నుంచే ట్రక్ నడిపారు, ఎవరూ చూడట్లేదని పారిపోయారు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 07:29 PM

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలో ఇటీవలే రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు డ్రైవర్ మహిళ పైనుంచే వాహనాన్ని పోనిచ్చాడు. ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కను అక్కడే ఆపి బాధితురాలిని ఆస్పత్రికి తరలించాల్సింది పోయి ఎవరూ చూడట్లేదని పారిపోయాడు. తన వెంట కూడా ఎవరూ పడకపోయేసరికి ఇక గండం తప్పిందనుకున్నాడు. కానీ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలించారు. ఈక్రమంలోనే పోలీసులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  చాలా ఉపయోగపడింది. 36 గంటల్లోనే నిందితుడిని పట్టించింది. అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


మధ్యప్రదేశ్‌కు చెందిన భార్యాభర్తలు ఈ నెల 9వ తేదీన రాఖీ పండుగ సందర్భంగా బంధువుల ఇంటికి వెళ్తుండగా నాగ్‌పూర్‌లోని ఓ హైవేపై ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఆ ధాటికి భార్య కిందపడిపోగా.. ట్రక్ డ్రైవర్ కనికరం లేకుండా ఆమెపై నుంచే ట్రక్కును నడుపుకుంటూ వేగంగా పారిపోయాడు. ఈ ఘటన తర్వాత.. తన భార్య ప్రాణం పోవడంతో ఆ భర్త తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ముఖ్యంగా భార్యను అంబులెన్సు, ఇతర వాహనం ద్వారా తరలించేందుకు తన వద్ద సరిపడా డబ్బులు కూడా లేకపోవడంతో మృతదేహాన్ని బైకుపై పెట్టుకునే నడుపుకుంటూ వెళ్లాడు.


ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సషల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. వీటిని చూసిన ప్రతీ ఒక్కరూ కంటతడి పెట్టారు. ముఖ్యంగా ఈ వీడియోలు పోలీసుల కంట కూడా పడగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా ఓ ట్రక్కు ఆమెను ఢీకొన్నట్లు భర్త చెప్పాడు. అది ఎరుపు రంగులో ఉంటుందని మాత్రమే వివరించాడు. చూసిన ఒక్కడూ ఇంతకుమించి ఎలాంటి వివరాలు అందించలేకపోవడంతో పోలీసులకు ఈ కేసు చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా హైవేపై నిరంతరం వేలాది వాహనాలు తిరుగుతుండటం వల్ల ఆ చిన్న ఆధారంతో నిందితుడిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.


ఈ దశలో పోలీసులు సృజనాత్మకంగా ఆలోచించి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దార్ దీని గురించి వివరిస్తూ.. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న మూడు టోల్ ప్లాజాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను తాము సేకరించినట్లు చెప్పారు. ఈ లక్షలాది వీడియో క్లిప్‌లను పరిశీలించడానికి ఏఐ అల్గారిథమ్‌ను వినియోగించామన్నారు. ఏఐ అల్గారిథం ఈ ఫుటేజీలను రెండు దశల్లో విశ్లేషించిందని.. మొదటి దశలో ఇది ట్రక్కుల వీడియోలను మాత్రమే గుర్తించి వాటిలో ఎరుపు రంగు గుర్తులు ఉన్నవాటిని వేరు చేసిందన్నారు. ఇక రెండో దశలో ప్రమాదం జరిగిన సమయాన్ని బట్టి ఏ ట్రక్కు ఎంత వేగంతో ప్రయాణించిందో లెక్కించి సరిగ్గా అదే సమయానికి అక్కడికి చేరుకున్న ట్రక్కును కచ్చితంగా గుర్తించినట్లు వెల్లడించారు.


ఏఐ విశ్లేషణ ఆధారంగా పోలీసులు గ్వాలియర్-కాన్‌పూర్ హైవేపై ప్రయాణిస్తున్న ఒక ట్రక్కును గుర్తించారు. అది ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి సుమారు 700 కిలో మీటర్ల దూరంలో ఉంది. వెంటనే ఆ ట్రక్కును వెంబడించి ఆపిన పోలీసులు.. దాని డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఆపై విచారణ చేపట్టగా.. అతడు కూడా  నేరాన్ని అంగీకరించాడు. ఇలా ఏఐ సాయంతో కేవలం 36 గంటల్లోనే నిందితుడిని పట్టుకోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa