ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖార్కివ్‌లో నివాస భవనంపై రష్యా డ్రోన్ దాడి

international |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 07:28 PM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర విషాదాన్ని మిగులుస్తోంది. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో దాడులు ఆగడం లేదు. తాజాగా ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంపై రష్యా జరిపిన డ్రోన్ దాడిలో ఏడాది వయసున్న పసికందుతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఉక్రెయిన్ మరోసారి ఉలిక్కిపడింది. ఈరోజు ఖార్కివ్‌లోని ఓ ఐదంతస్తుల నివాస భవనంపై రష్యా డ్రోన్‌తో దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి, శిథిలాల కింద చిక్కుకున్న ఓ యువకుడిని, యువతిని సురక్షితంగా బయటకు తీశాయి.ఈ దాడికి కొన్ని గంటల ముందు, అంటే నిన్న సాయంత్రం కూడా ఖార్కివ్‌పై రష్యా క్షిపణి దాడికి పాల్పడింది. ఆ ఘటనలో 13 ఏళ్ల బాలుడితో సహా ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు.మరోవైపు, గత శుక్రవారం రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒకరు మరణించగా, 10 మంది గాయపడినట్లు రష్యా ప్రాంతీయ గవర్నర్ అలెగ్జాండర్ ఖిన్‌ష్టెయిన్ తెలిపారు. నగరంలోని రైల్వే జిల్లాలో ఉన్న ఓ భవనంపై డ్రోన్ దాడి జరగడంతో పై నాలుగు అంతస్తుల్లో మంటలు చెలరేగినట్లు సమాచారం.ఇలా ఇరు దేశాలు దాడులతో రెచ్చిపోతున్న తరుణంలోనే, ఆగస్టు 15న అమెరికాలోని అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక సమావేశం జరిగింది. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ప్రధానంగా ఉక్రెయిన్ యుద్ధంపైనే దృష్టి సారించారు. ఈ భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ కాకుండా, ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష శాంతి ఒప్పందం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. దౌత్యపరమైన చర్చలతో లక్షలాది ప్రాణాలను కాపాడవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa