పుట్టిన ప్రతి మనిషికి మరణం ఖాయమనీ.. కానీ మనం చనిపోయిన తర్వాత ప్రజలు గుర్తుంచుకునేలా బతకాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అప్పుడే జీవితానికి సార్థకత అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీ-4 కార్యక్రమం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. పీ4 అమలు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబాలు- మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహించారు. పీ4 కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఉగాది రోజు లాంఛనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా.. ఇప్పటి వరకు సుమారుగా 13 లక్షల బంగారు కుటుంబాలు,1.40 లక్షల మంది మార్గదర్శులను గుర్తించింది.
మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో మార్గదర్శులలో కొంతమందిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు అందించిన భారీ విరాళం గురించి వెల్లడించారు. ఓ భక్తుడు తిరుమల వెంకటేశ్వరస్వామికి 121 కేజీల బంగారం విరాళం ఇస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
" నాకు తెలిసిన శ్రీవారి భక్తుడు.. కంపెనీని పెట్టాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే కంపెనీ పెట్టాడు. సక్సెస్ అయ్యాడు. కంపెనీలోని 60 శాతం వాటాను అమ్మాడు. 60 శాతం అమ్మితే 1.5 బిలియన్ అంటే సుమారుగా ఆరేడు వేల కోట్లు డబ్బులు వచ్చాయి. ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడని.. ఆయనకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుని, 121 కేజీల బంగారాన్ని వెంకటేశ్వరస్వామికి ఇస్తున్నారు ఇప్పుడాయన. 121 కేజీల బంగారం అంటే దగ్గర దగ్గరా 150 కోట్లు ఉంటుంది. ఆయన ఒకే విషయం అడిగారు. తన పేరు మాత్రం బయట పెట్టొద్దంటూ లెటర్ ఇచ్చారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఒకటి. వెంకటేశ్వరస్వామి రోజుకు 120 కేజీల ఆభరణాలు ధరిస్తారు. ఇక్కడ భక్తుడు కూడా 121 కేజీల బంగారం విరాళంగా ఇస్తున్నారు. అయితే వెంకటేశ్వరస్వామి ఎన్ని ఆభరణాలు ధరిస్తారనేదీ ఆయనకు తెలియదు. ఒకే వ్యక్తి శ్రీవారికి 140 కోట్ల విలువైన బంగారం ఇస్తున్నాడంటే.. అది ఆయనకు దేవుడిపై ఉన్న నమ్మకం". మరోవైపు కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను సీఎం చంద్రబాబు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా కుటుంబాలను దత్తత తీసుకున్నందుకు సంకేతంగా అడాప్ట్ ట్రీని చంద్రబాబు బంగారు కుటుంబాలకు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa