ఇండియా కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగువాడైన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో, వైఎస్ షర్మిల తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా ఆలోచించి, తెలుగు బిడ్డగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహకరించాలని మంగళవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని ఆమె అభివర్ణించారు.జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ఆయన ఒక స్వతంత్ర నిపుణుడని షర్మిల స్పష్టం చేశారు. "ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు న్యాయ రంగంలో విశేష అనుభవం ఉంది. ఆయన ఎంపికను రాజకీయ కోణంలో చూడవద్దు" అని ఆమె అన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి వంటి నిష్పక్షపాత న్యాయ నిపుణులు ఉన్నత పదవుల్లో ఉండటం అవసరమని ఇండియా కూటమి భావిస్తోందని ఆమె పేర్కొన్నారు. పార్టీల మధ్య ఉన్న రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, తెలుగు వ్యక్తికి దక్కిన ఈ గౌరవాన్ని నిలబెట్టేందుకు అందరూ కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తెలుగువారి ఐక్యతను చాటాలని షర్మిల సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa