మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. మంగళవారం సుప్రీం కోర్టులో వైఎస్ వివేకా హత్యకేసుపై విచారణ జరగ్గా.. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి, అప్పటి సీబీఐ అధికారి రాంసింగ్పై ఉన్న కేసులను కొట్టివేస్తామని జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్ల ధర్మాసనం తెలిపింది. కోర్టులో విచారణ సందర్భంగా వివేకా హత్య కేసులో అవినాష్తో సహా నిందితుల బెయిల్ను రద్దు చేయాలని వైఎస్ సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టులో వాదించారు. సీబీఐ దర్యాప్తును త్వరగా ముగించిందని.. కేసులో సూత్రదారులు ఎవరో బయటకు రావాల్సి ఉందని.. అందుకే లోతుగా విచారణ జరగాలన్నారు. ఈ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని, సాక్ష్యాలను నాశనం చేస్తున్నారని కోర్టుకు వివరించారు. వైఎస్ సునీత దంపతులతో పాటు సీబీఐ అధికారి రాంసింగ్పైనా తప్పుడు కేసులు పెట్టారని వాదించారు. దీంతో ధర్మాసనం వారిపై కేసుల్ని క్వాష్ చేసింది.
వైఎస్ వివేకా హత్యకేసులో నిందితులను జైలులో కాలపరిమితి లేకుండా ఉంచడం మంచిది కాదు కానీ.. ఈ హత్య జరిగిన తీరు చూస్తే 2, 5 ఏళ్లు నిందితులకు చాలా తక్కువ శిక్ష అనిపిస్తోందని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిందితులు ఆధారాలు చెరిపేయడం, సాక్ష్యాధారాలు లేకుండా చేసినట్లు తేలిందని.. వివేకాది గుండెపోటని ముందు ప్రచారం చేశారని.. ఆ తర్వాత మళ్లీ రక్తపు వాంతులంటూ ప్రచారం చేయడాన్ని గుర్తు చేశారు. వివేకాది హత్యకాదని నిరూపించేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. ఈ వివరాలు సీబీఐ దర్యాప్తులో బయటపడ్డాయన్నారు.
ఈ హత్యకేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో కడప జైలుకు వెళ్లారని ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ వాదించారు. వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరిని బెదిరించారని కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని.. ఈ కేసు తీవ్రతను బట్టి కోర్టు నిందితులకు మరణశిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు.
ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం వివేకా కేసులో తదుపరి దర్యాప్తుపై సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. నిందితుల బెయిల్ రద్దు అంశంపై కూడా సీబీఐ అభిప్రాయం కోరింది. వివేకా కుమార్తె, అల్లుడు, సీబీఐ అధికారిపై పెట్టిన కేసులను కొట్టివేసింది.. వారిపై కేసు పెట్టడం చట్ట దుర్వినియోగమేనని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై కేసులు పెట్టేందుకు సరైన కారణం లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa