ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా ఎంపీని రేప్ చేసి, చంపేస్తానన్న మహీంద్రా కంపెనీ ఉద్యోగి

national |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 09:24 PM

మహిళా ఎంపీపై మహీంద్రా కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి.. సోషల్ మీడియా వేదికగా హత్యాచార బెదిరింపులకు దిగడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై మహీంద్రా గ్రూప్ స్పందించింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పిన మహీంద్రా గ్రూప్.. దీనిపై వెంటనే దర్యాప్తు చేస్తామని వెల్లడించింది. ఒకవేళ అది నిజమని తేలితే.. సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఈ ఘటనకు సంబంధించి.. తాజాగా మహీంద్రా గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది. తోటి వారిని గౌరవంగా చూడటమే తమకు ముఖ్యమని.. అది ఉల్లంఘించేది తమ ఉద్యోగి అయినా.. వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది.


మహీంద్రా గ్రూప్‌లో పనిచేస్తున్న సత్యబ్రత నాయక్‌ అనే ఉద్యోగి.. తన ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ సంచలనం రేపుతోంది. బీజేపీ కార్యకర్త అని భావిస్తున్న సత్యబ్రత నాయక్.. బీజేడీ మహిళా ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆ పోస్ట్ పెట్టడం దుమారానికి కారణం అయింది. సోషల్ మీడియా వేదికగా.. మహిళా ఎంపీకి హత్యాచార బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సదరు మహిళా ఎంపీ బయటికి తీసుకురావడం గమనార్హం. సత్యబ్రత నాయక్ ఫేస్‌బుక్‌లో పెట్టి పోస్ట్‌ను స్క్రీన్‌షాట్‌లను తీసి.. ఆమె పోస్ట్ చేశారు.


ఇలాంటి పోస్ట్‌ల పట్ల ఆ మహిళా ఎంపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనను అత్యాచారం చేసి చంపేస్తానని బహిరంగంగా బెదిరిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఒక ఎంపీగా ఉన్న తనకే ఇలాంటి బెదిరింపులు వస్తుంటే.. ఇక దేశంలో ఉన్న సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ఆమె కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. మరోవైపు.. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని.. అసలు ఈ బెదిరింపులను వారు తీవ్రంగా పరిగణించడం లేదంటూ ఆ మహిళా ఎంపీ మరో పోస్ట్ పెట్టారు. తనను బెదిరించిన సత్యబ్రత నాయక్‌పై పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.


ఈ వ్యవహారం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో.. ఆ మహిళా ఎంపీకి ఇతర పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఇలాంటి నీచమైన ఘటనలు జరగడం సిగ్గుచేటు అని శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో అతడు మహీంద్రా కంపెనీ ఉద్యోగి అని తెలుస్తోందని.. అతడిపై సదరు కంపెనీ కూడా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మహీంద్రా గ్రూప్ స్పందించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa