ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌పై అమెరికా టారీఫ్‌లు ఏకపక్ష బెదిరింపులే.. చైనా కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 09:28 PM

గల్వాన్‌ లోయ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్, చైనాలు విబేధాలను పక్కనబెట్టి.. సంబంధాలను చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్‌పై అమెరికా ప్రతీకార సుంకాల యుద్ధాన్ని ప్రకటించిన వేళ.. న్యూఢిల్లీ, బీజింగ్‌లు కలిసి నడిచేందుకు కృషి చేయడం శుభపరిణామం. ఈ క్రమంలో ఐదేళ్ల అనంతరం చైనా విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటనతో శక్తివంతమైన రెండు ఆసియా దేశాల మధ్య సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో చైనా విదేశీ వ్యవహరాల మంత్రి వాంగ్‌యీ సోమవారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్‌పై అమెరికా సుంకాలను వాంగ్‌యీ తప్పుబట్టారు. ఇది ఏకపక్ష బెదిరింపులని ఆయన అభిప్రాయపడ్డారు.


జైశంకర్‌, వాంగ్‌యీ సమావేశం ముగిసిన అనంతరం చైనా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘శతాబ్దానికి ఒకసారి ప్రపంచం వేగంగా పరివర్తన చెందుతుందని భారత్ విదేశాంగ మంత్రితో డాక్టర్ జైశంకర్‌తో వాంగ్‌యీ అన్నారు’ అని పేర్కొంది. టారిఫ్‌ల విషయంలో అమెరికా తీరును ప్రస్తావిస్తూ.. ‘ఏకపక్ష బెదిరింపులు ప్రబలంగా ఉన్నాయి.. స్వేచ్ఛా వాణిజ్యం, అంతర్జాతీయ క్రమం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు’ అని తెలిపింది.


‘‘2.8 బిలియన్లకు పైగా (280 కోట్లకు) జనాభా కలిగిన రెండు అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న భారత్, చైనాలు. ప్రపంచ ఆందోళన, బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలి.. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఐక్యంగా ఉండి, బలోపేతం కావడానికి ఒక ఉదాహరణగా నిలిచి, బహుళ ధ్రువ ప్రపంచం, అంతర్జాతీయ సంబంధాల ప్రజాస్వామ్యీకరణలను ప్రోత్సహించేందుకు దోహదపడాలి’ అని చైనా విదేశాంగ మంత్రి అన్నారు.


ఇక, వాంగ్‌యీ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకునే అవకాశం కల్పించిందని జైశంకర్ అన్నారు. ‘‘మన సంబంధాలు గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాయి.. ఇప్పుడు రెండు దేశాలు కలిసి ముందుకు సాగాలని కోరుకుంటున్నాయి. దీనికి ఇరువైపుల నుంచి నిజాయితీ, నిర్మాణాత్మక విధానం అవసరం’’ అని జైశంకర్ స్పష్ట చేశారు. ‘పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ఆసక్తి అనే మూడు సూత్రాలను అనుసరిస్తూ.. ఎటువంటి వివాదాలు, సంఘర్షణలు లేకుండా సంబంధాలను మెరుగుపరుచుకోవాలి’ అని జైశంకర్ పేర్కొన్నారు.


ఇదిలా ఉండగా.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఆగస్టు 19 (మంగళవారం) భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్య గురించి దోవల్, వాంగ్ యీలు చర్చించనున్నారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడం ఇరు దేశాల సంబంధాలకు అత్యంత కీలకమైందని, ఉద్రిక్తతలను తగ్గించుకుని ముందు సాగడం చాలా అవసరమని జైశంకర్ అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa