ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. పేదరికంలోకి 25 లక్షల మందికిపైగా భారతీయులు

business |  Suryaa Desk  | Published : Wed, Aug 20, 2025, 09:08 PM

భారత్‌తోపాటు ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లతో విరుచుకుపడుతున్నారు. భారత్ మిత్రదేశమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఫ్రెండ్ అని చెబుతూనే.. అన్ని దేశాలతో పోల్చితే.. మన దేశంపై మాత్రం మరింత గట్టిగానే కొరఢా ఝళిపిస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలు అమల్లోకి రాగా.. ఈనెల 27వ తేదీ నుంచి మరో 25 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించారు. అయితే రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నందుకు ప్రతీకారంగా భారత్‌‍పై అధిక సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ బహిరంగంగానే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ విధించిన టారిఫ్‌లతో భారత్‌లోని 25 లక్షలమందికిపైగా ప్రజలు పేదరికంలోకి నెట్టబడతారని తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని భదోహి ప్రాంతంలో గత కొన్ని దశాబ్దాలుగా కార్పెట్ బిజినెస్ నిర్వహిస్తున్న ఇష్తియాక్ అహ్మద్ ఖాన్.. ట్రంప్ టారిఫ్‌ల గురించి స్పందించారు. అమెరికా ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించడంతో.. వాటిని తట్టుకోవడం ఎలాగో తెలియడం లేదు. ఇక త్వరలోనే మరో 25 శాతం విధిస్తే.. తమ వ్యాపారాలు కొనసాగించడం అసాధ్యమని పేర్కొన్నారు. 50 శాతం టారిఫ్‌ల వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారనే భయం నెలకొందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


మన దేశంలో తయారయ్యే కార్పెట్లలో 98 శాతం విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. అందులో అమెరికా వాటా దాదాపు 60 శాతం ఉంటుంది. అమెరికాకు ఎగుమతి అయ్యే 500 డాలర్ల విలువైన కార్పెట్‌పై ఇప్పుడు 125 డాలర్ల సుంకం విధిస్తుండగా.. ఈనెల 27వ తేదీ నుంచి సుంకాలు 250 డాలర్లకు చేరుతుందని ఇష్తియాక్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. దీంతో అమెరికాలో భారత కార్పెట్లు దిగుమతి చేసుకునే వారికి ధరలు విపరీతంగా పెరిగి.. వారి నుంచి వచ్చే ఆర్డర్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు.


భదోహితోపాటు పరిసర ప్రాంతాల్లోని దాదాపు 25 లక్షల మంది.. ఈ కార్పెట్ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని.. అమెరికా 50 శాతం సుంకాల కారణంగా వీరంతా జీవనోపాధి కోల్పోయి.. మళ్లీ పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందని ఇష్తియాక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు ప్రభుత్వాలు పరిష్కారం కనుగొనకపోతే.. పల్లెవాసులు, కార్మికులకు ఎలాంటి భవిష్యత్తు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.


అయితే ట్రంప్ సుంకాలు కేవలం భారత్‌లోని కార్పెట్ పరిశ్రమతో పాటు.. ఇతర రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, రొయ్యలు, ఫర్నిచర్ వంటి రంగాలపైనా అమెరికా సుంకాల ప్రభావం తీవ్రంగా ఉండనుందని విశ్లేషకులు చెబుతున్నారు. మన దేశంలో ఈ రంగాలు కోట్ల మందికి ఉపాధిని అందించడమే కాకుండా.. భారతదేశ విదేశీ మారక నిల్వలకు అండగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సుంకాలు పెరిగి ఈ రంగాలు ఎఫెక్ట్ అయితే.. అది భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


ఇంటర్నేషనల్ ట్రేడ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడతాయని ఢిల్లీకి చెందిన గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ సంస్థ డైరెక్టర్ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే.. అమెరికాతో టారిఫ్‌ల సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఎలాంటి ప్రణాళికను వెల్లడించలేదని పేర్కొన్నారు. రుణాలు మాఫీ చేసేందుకు కూడా బ్యాంకులు సిద్ధంగా ఉండవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఇక ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ట్రంప్ సుంకాల గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించనప్పటికీ.. కఠిన సమయాలు రాబోతున్నాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆత్మనిర్భరత ఆవశ్యకతను నొక్కి చెప్పారు. దీంతో మోదీ వ్యాఖ్యలపై కొందరు ఆర్థిక నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం అంటే.. అంతర్జాతీయ వాణిజ్యానికి ఒక అడుగు వెనక్కి వేయడమేనని వారు చెబుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa