ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలపై చర్చించి, వాటన్నిటికీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలిపింది.రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.904 కోట్లు కేటాయిస్తూ సీఆర్డీఏ చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు, అమరావతిలో కొత్తగా అసెంబ్లీ భవనాన్ని రూ.617 కోట్లతో, హైకోర్టు భవనాన్ని రూ.786 కోట్లతో నిర్మించేందుకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ నిర్ణయాలతో రాజధాని నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకోనున్నాయని స్పష్టమవుతోంది.వ్యవసాయ, సాగునీటి రంగాలకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేసింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేందుకు మార్క్ఫెడ్ ద్వారా రూ.1000 కోట్ల రుణం సమీకరించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా, పోలవరం ఎడమ కాల్వ పనులకు రీటెండర్కు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు కూడా ఆమోద ముద్ర వేసింది.సామాజిక న్యాయం దిశగా మరో కీలక అడుగు వేస్తూ, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా 'ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 4.0'ను కూడా మంత్రివర్గం ఆమోదించింది. అనంతపురం జిల్లాను సౌర, పవన విద్యుత్ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రాజెక్టులకు, రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టుల కోసం భూముల కేటాయింపునకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. రాష్ట్ర అధికార భాషా సంఘం పేరును మార్చే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం అంగీకరించింది.సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, ఈ నిర్ణయాలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. మంత్రులంతా ప్రజలతో మమేకమై, దూకుడుగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారని ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa