ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత సొంత స్పేస్ స్టేషన్ నమూనాను ఆవిష్కరించిన ఇస్రో

national |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 06:26 AM

అంతరిక్ష రంగంలో భారత్ మరో చారిత్రక ఘట్టానికి నాంది పలికింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 'భారతీయ అంతరిక్ష్ స్టేషన్' (బీఏఎస్) ఏర్పాటు దిశగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కీలక ముందడుగు వేసింది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఈ ప్రతిష్ఠాత్మక స్పేస్ స్టేషన్ మాడ్యూల్ నమూనాను తొలిసారిగా ఆవిష్కరించింది.ఈ ప్రాజెక్టు పూర్తయితే, ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్), చైనాకు చెందిన తియాంగాంగ్ తర్వాత సొంతంగా అంతరిక్షంలో పరిశోధనా కేంద్రాన్ని నిర్మించుకున్న దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. ఇస్రో ప్రణాళికల ప్రకారం, 2028 నాటికి తొలి మాడ్యూల్ (BAS-01)ను ప్రయోగించనున్నారు. ఆ తర్వాత దశలవారీగా విస్తరించి, 2035 నాటికి మొత్తం ఐదు మాడ్యూళ్లతో పూర్తిస్థాయి అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఆవిష్కరించిన మొదటి మాడ్యూల్ BAS-01 దాదాపు 10 టన్నుల బరువు ఉంటుంది. ఇది భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో పరిభ్రమించనుంది. ఇందులో పర్యావరణ నియంత్రణ, జీవనాధార వ్యవస్థ, భారత్ డాకింగ్ సిస్టమ్, ఆటోమేటెడ్ హ్యాచ్ సిస్టమ్ వంటి అత్యాధునిక, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యవస్థలు ఉన్నాయి.ఈ స్పేస్ స్టేషన్ ప్రధానంగా సూక్ష్మ గురుత్వాకర్షణపై (మైక్రోగ్రావిటీ) పరిశోధనలకు వేదికగా నిలవనుంది. అంతరిక్ష శాస్త్రాలు, జీవశాస్త్రాలు, వైద్యం వంటి రంగాల్లో కీలక ప్రయోగాలకు ఇది దోహదపడుతుంది.ముఖ్యంగా, సూక్ష్మ గురుత్వాకర్షణ మానవ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అధ్యయనం చేయడానికి, భవిష్యత్తులో చేపట్టబోయే సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు అవసరమైన టెక్నాలజీలను పరీక్షించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంధనాన్ని నింపుకోవడం, రేడియేషన్, అంతరిక్ష శిథిలాల నుంచి రక్షణ కల్పించడం, వ్యోమగాములు స్పేస్‌వాక్ చేసేందుకు వీలు కల్పించడం వంటి అనేక కీలక సామర్థ్యాలను ఈ కేంద్రం కలిగి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa