అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బోల్టన్ ఇంటిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సోదాలు నిర్వహించిన కొన్ని గంటలకే ట్రంప్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బోల్టన్ ఒక నీచుడు అని, ఓ పనికిమాలిన వ్యక్తి అని ఆయన అభివర్ణించారు.జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన దర్యాప్తులో భాగంగా ఎఫ్బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ ఆదేశాలతో శుక్రవారం ఉదయం బోల్టన్ నివాసంపై అధికారులు దాడులు చేశారు. ఈ పరిణామంపై వైట్ హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ మ్యూజియంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఈ సోదాల గురించి తనకు ముందుగా తెలియదని, టీవీ వార్తల ద్వారానే తెలుసుకున్నానని స్పష్టం చేశారు. "నేనేమీ జాన్ బోల్టన్కు అభిమానిని కాదు. అతను నిజంగా ఒక అల్పుడు. సాధారణంగా సైలెంట్గా ఉంటాడు కానీ, టీవీ కెమెరాల ముందు మాత్రం నా గురించి చెడుగా మాట్లాడతాడు" అంటూ ట్రంప్ విమర్శించారు.బోల్టన్ 2018-19 మధ్యకాలంలో ట్రంప్ వద్ద జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత 2020లో ఆయన రాసిన "ది రూమ్ వేర్ ఇట్ హ్యాపెన్డ్" అనే పుస్తకంలో రహస్య సమాచారాన్ని బయటపెట్టారనే ఆరోపణలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. అప్పట్లో ఈ పుస్తక ప్రచురణను ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించారు.ఈ సోదాల అనంతరం ఎఫ్బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్, "చట్టానికి ఎవరూ అతీతులు కాదు" అని ‘ఎక్స్’లో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, భారత్పై ట్రంప్ విధిస్తున్న భారీ సుంకాల వల్ల అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతోందని, ఇది భారత్ను రష్యా-చైనా కూటమి వైపు నెడుతోందని బోల్టన్ ఇటీవలే ట్రంప్ను విమర్శించారు. ఈ విమర్శల ఫలితంగానే అతడి ఇంట్లో సోదాలు జరిగినట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa