ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన విదేశాంగ మంత్రి జైశంకర్

national |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 05:31 PM

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము మధ్యవర్తిత్వం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాల్లో మూడో దేశం జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.ఢిల్లీలో జరిగిన 'ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్ 2025' సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది మే నెలలో భారత్-పాక్ మధ్య నాలుగు రోజుల పాటు నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో అమెరికా జోక్యం చేసుకుందని ట్రంప్ పదేపదే చెబుతున్న మాటల్లో నిజం లేదని తేల్చిచెప్పారు. "పాకిస్థాన్‌తో మా సంబంధాల్లో మధ్యవర్తిత్వాన్ని మేం అంగీకరించబోమని 1970ల నుంచి, అంటే దాదాపు 50 ఏళ్లుగా దేశంలో ఒక జాతీయ ఏకాభిప్రాయం ఉంది" అని జైశంకర్ అన్నారు.భద్రత, ఆర్థిక సహకారం వంటి రంగాల్లో అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు మళ్లీ బలపడుతున్న తరుణంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ రెండుసార్లు అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనల్లో వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి, క్రిప్టోకరెన్సీ నిబంధనల వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా జైశంకర్, దేశ ప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వ వైఖరిని కూడా స్పష్టం చేశారు. "రైతుల ప్రయోజనాలు, దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, మధ్యవర్తిత్వ వ్యతిరేకత వంటి అంశాల్లో ఈ ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఉంది" అని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారు, ఆ విషయాన్ని భారత ప్రజలకు ధైర్యంగా చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. "రైతుల ప్రయోజనాలను కాపాడటానికి మీరు సిద్ధంగా లేరని ప్రజలకు చెప్పండి. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి మీరు విలువ ఇవ్వరని చెప్పండి. మేం మాత్రం వీటికి కట్టుబడి ఉంటాం. వాటిని కాపాడుకోవడానికి ఏం చేయాలో అది చేస్తాం" అని జైశంకర్ గట్టిగా చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa