ఆసియా కప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్తో క్రికెట్ ఆడాలన్న నిర్ణయం దేశ ప్రజలకు బాధ కలిగించే అంశమని, ఇది అమానుష చర్య అని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ఒక లేఖ రాశారు."పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల రక్తం ఇంకా ఆరలేదు. వారి కుటుంబాల కన్నీళ్లు ఇంకిపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్తో క్రికెట్ ఆడటం మానవత్వం లేని చర్య" అని సంజయ్ రౌత్ తన లేఖలో పేర్కొన్నారు. పాకిస్థాన్తో క్రికెట్ ఆడటం మన సైనికుల పరాక్రమాన్ని అవమానించడమే కాకుండా, కశ్మీర్ కోసం ప్రాణత్యాగం చేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీతో సహా ప్రతి అమరవీరుడిని అగౌరవపరచడమేనని ఆయన విమర్శించారు.ప్రధాని, హోంమంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా క్రీడా మంత్రిత్వ శాఖ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేదని సంజయ్ రౌత్ ఆరోపించారు. దేశభక్తి కలిగిన పౌరుల మనోభావాలనే తాను ఈ లేఖలో వ్యక్తపరుస్తున్నానని తెలిపారు. "ఈ మ్యాచ్లు దుబాయ్లో జరుగుతున్నాయి. ఒకవేళ ఇవి మహారాష్ట్రలో జరిగి ఉంటే, బాలాసాహెబ్ ఠాక్రే శివసేన వాటిని అడ్డుకుని ఉండేది. మీరు హిందుత్వం, దేశభక్తి కంటే పాక్తో క్రికెట్కే ప్రాధాన్యత ఇస్తూ దేశ ప్రజల మనోభావాలను కాలరాస్తున్నారు. మీ నిర్ణయాన్ని శివసేన తీవ్రంగా ఖండిస్తోంది" అని రౌత్ స్పష్టం చేశారు.పాకిస్థాన్తో జరిగే మ్యాచ్ల వెనుక భారీ ఎత్తున బెట్టింగ్, ఆన్లైన్ జూదం జరుగుతోందని, ఇందులో చాలా మంది బీజేపీ సభ్యుల ప్రమేయం కూడా ఉందని ఆయన ఆరోపించారు. గుజరాత్కు చెందిన ప్రముఖ వ్యక్తి జై షా ప్రస్తుతం క్రికెట్ వ్యవహారాలను నడిపిస్తున్నారని, దీని వెనుక బీజేపీకి ఏమైనా ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు."ఒకప్పుడు 'రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవు' అని మీరే అన్నారు. మరి ఇప్పుడు రక్తం, క్రికెట్ కలిసి ప్రవహిస్తాయా పహల్గామ్ దాడికి పాల్పడింది పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థే. ఆ దాడి 26 మంది మహిళల నుదుటి సిందూరాన్ని చెరిపేసింది. ఆ తల్లులు, సోదరీమణుల ఆవేదనను మీరు పరిగణనలోకి తీసుకున్నారా" అని ప్రధానిని రౌత్ ప్రశ్నించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa