ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళ క్రికెట్ లీగ్‌లో సంజూ శాంసన్ విధ్వంసం

sports |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 07:58 AM

టీమిండియాలో తన స్థానంపై నెలకొన్న అనిశ్చితికి, వస్తున్న విమర్శలకు భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చాడు. ఆసియా కప్ సమీపిస్తున్న వేళ, కేరళ క్రికెట్ లీగ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి కేవలం 42 బంతుల్లోనే విధ్వంసక సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో సెలక్టర్ల దృష్టిని మరోసారి తనవైపు తిప్పుకున్నాడు.ఆదివారం ఏరీస్ కొల్లం సెయిలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొచ్చి బ్లూ టైగర్స్ తరఫున బరిలోకి దిగిన సంజూ, ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించి సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 51 బంతుల్లో 121 ర‌న్స్ బాదాడు. ఈ అద్భుత ప్రదర్శనతో తన జట్టుకు అండగా నిలిచాడు.ఆసియా కప్‌కు వైస్-కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి రానుండటంతో సంజూ ఓపెనింగ్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. గిల్‌తో పాటు అభిషేక్ శర్మను ఓపెనర్లుగా ఆడించే అవకాశాలు ఉన్నాయని, ఈ క్రమంలో సంజూను మిడిలార్డర్‌కు పరిమితం చేయొచ్చని లేదా పూర్తిగా పక్కన పెట్టవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఓపెనర్‌గా వచ్చి శతకం బాదడం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఇటీవలే టీమిండియాలో మిడిలార్డర్ స్థానాన్ని పదిలం చేసుకునే ఉద్దేశంతో, కేరళ లీగ్‌లోని గత మ్యాచ్‌లో సంజూ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ, ఆ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొని కేవలం 13 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ వైఫల్యం తర్వాత తిరిగి ఓపెనర్‌గా వచ్చి అద్భుత సెంచరీతో సత్తా చాటడం గమనార్హం.కాగా, సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తన ఆసియా కప్ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14న దాయాది పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa