చమురు కొనుగోళ్ల విషయంలో తమ దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని, ఎక్కడ ఉత్తమమైన డీల్ లభిస్తే అక్కడి నుంచే కొనుగోలు చేస్తామని భారత్ మరోసారి ప్రపంచానికి స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని అమెరికా విమర్శిస్తున్న నేపథ్యంలో, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం తేల్చిచెప్పింది.రష్యాలో భారత రాయబారిగా ఉన్న వినయ్ కుమార్, రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ 'టాస్'కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల మంది ప్రజలున్న తమ దేశ ఇంధన భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం తమ బాధ్యత అని ఆయన అన్నారు. "భారత కంపెనీలు వాణిజ్య ప్రాతిపదికన పనిచేస్తాయి. మార్కెట్లో ఎక్కడ అత్యుత్తమ డీల్ దొరికితే అక్కడి నుంచే చమురు కొనుగోలు చేస్తాయి. ప్రస్తుత పరిస్థితి ఇదే" అని ఆయన వివరించారు. భారత్ రష్యాతో పాటు ఇతర దేశాలతో చేస్తున్న చమురు వాణిజ్యం, ప్రపంచ చమురు మార్కెట్లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి సహాయపడిందని ఆయన పేర్కొన్నారు.రష్యా నుంచి చమురు కొనడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోందని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు అన్యాయమైనవని పేర్కొంటూ, తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని వినయ్ కుమార్ స్పష్టం చేశారు. కేవలం భారతే కాకుండా, అమెరికా, ఐరోపా దేశాలు కూడా రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.ఇదే అంశంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా శనివారం ఘాటుగా స్పందించారు. "వ్యాపార అనుకూల అమెరికా ప్రభుత్వంలో ఉన్నవారు, ఇతరులు వ్యాపారం చేస్తున్నారని ఆరోపించడం విచిత్రంగా ఉంది. మా నుంచి శుద్ధి చేసిన చమురును కొనడంలో మీకు సమస్య ఉంటే, కొనకండి. మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడం లేదు కదా అంటూ ఆయన అమెరికాకు సూటిగా సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యలతో అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, తమ దేశ ఇంధన అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని భారత్ తన వైఖరిని గట్టిగా వినిపించింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa