హైదరాబాద్లో.. ప్రేమించి, పెద్దలను ఎదురించి కులాంతర వివాహం చేసుకున్న ఓ యువకుడు.. భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనుమానంతో అతడి ప్రేమ మొత్తం చివరికి ద్వేషంలా మారింది. వరంగల్లో.. కట్నం కోసం భార్యను దారుణంగా హత్య చేశాడో భర్త. మహబూబ్నగర్లో.. భార్యను కత్తితో పొడిచి చంపి, మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఇవన్నీ తెలంగాణలో గత కొన్ని రోజులుగా భార్యలపై భర్తలు చేసిన దారుణాలు.
ఇవే కాదు.. జులైలో మహబూబాబాద్లో, మటన్ వండలేదని భార్యను కొట్టి చంపాడో భర్త. జూన్లో.. హైదరాబాద్లోని సరూర్నగర్లో భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతుందని చంపేశాడు. ఇక ఈ ఏడాది జనవరిలో మీర్పేట్లో వివాహిత హత్య ఎలాంటి సంచలనం సృష్టించిందో అందిరికీ తెలిసిందే. మాజీ ఆర్మీ జవాన్ తన భార్యను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికాడు. బాడీ పార్ట్స్ను చెరువులో విసిరేశాడు.
మహిళలపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో మహిళలపై దాడులు, హత్య ఘటనలు జరగడానికి కారణాలేంటి? ప్రేమ వివాహాల్లోనూ ఇలాంటివి ఎందుకు చోటుచేసుకుంటున్నాయి? చట్టాలు కఠినంగా ఉన్నా, పోలీసు కేసులు నమోదైనా ఎందుకు తెగిస్తున్నారు? మగవాళ్ల ప్రవర్తనలో ఈ మార్పులకు కారణాలేంటి? ఈ నేరాలకు ప్రభుత్వం, సమాజం ఎలా కారణమవుతున్నాయి? అనే విషయాలు ఇప్పుడు చర్చిద్దాం..
కేసులు 2023 2024 పెరుగుదల
మొత్తం కేసులు 1,38,312 1,69,477 22.53%
మహిళలపై నేరాలు 19,013 19,922 4.8%
అత్యాచారం కేసులు - 2,945 28.94% (2023 కంటే)
తెలంగాణలో మహిళలపై దాడులు ఏటా పెరుగుతూ పోతున్నాయి. 2023లో కంటే 2024లో మహిళలపై నేరాలు దాదాపు 5 శాతం పెరిగిపోయాయి. ఇక అత్యాచారాలైతే ఏకంగా 29 శాతం పెరగడం.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఇవి కాకుండా బయటకు రాని దారుణాలెన్నో..! మహిళలపై జరిగే అకృత్యాలు ఎన్నో! మహిళల కోసం ప్రత్యేక చట్టాలున్నా, వ్యవస్థలు ఉన్నా.. వారి మాన, ప్రాణాలను కాపాడలేక పోతున్నాయంటే.. తప్పెవరిది? దీనికి బాధ్యత ఎవరు వహించాలి?
కేసులు నమోదైనా.. ద్వేషం, ప్రతీకారం..
ఇలాంటి కేసుల్లో కుటుంబ గొడవల తర్వాత పోలీసు కేసులు నమోదవుతున్నాయి. పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరుగుతున్నాయి. అయినా.. వీటిని చాలా మంది లెక్కచేయట్లేదు. క్షణికావేశం కూడా కాదు, ద్వేషం పెంచుకుని పక్కా ప్లాన్తో భార్యలను చంపేస్తున్నారు. పెద్దలంటే గౌరవం, చట్టం మీద భయం లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. తన జీవితం, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అనే కనీస ఆలోచన కూడా లేకుండా ఎంతకైనా తెగించేస్తున్నారు. చట్టాలు.. న్యాయం చేయవనే అభద్రతా భావమో, వ్యవస్థల మీద నమ్మకం లేకనో, సమాజం మద్దతు ఇవ్వదని అపనమ్మకమో.. కానీ ఎంతటి దారుణాలకైనా తెగిస్తున్నారు.
ఈ పరిస్థితికి దారితీసిన కారణాలేంటి?
మహిళలను దేవతలుగా కొలిచే సమావజంలో ఇంతటి ఘోరాలు జరగుతుండటం.. మొత్తం సమాజం తలదించుకోవాల్సిన విషయం. సమాజంలోని విలువలు నిర్వీర్యం అవుతున్నాయనడానికి ఈ పరిస్థితి నిదర్శనం. ఇక్కడ.. ప్రజలు, పాలకులు, ప్రభుత్వాలు కలిసికట్టుగా ఫెయిల్ అయ్యాయి అనడంలో తప్పేమి లేదు! మనం గమనిస్తే.. భార్యలపై భర్తలు ఒడిగడుతున్న దారుణాలకు చాలా వరకు కారణాలు.. అనుమానం, వరకట్నం వేధింపులు ఉంటున్నాయి. ఆ తర్వాత మగవాళ్లు మద్యపానం తాగడం, కుటుంబ గొడవలు, వివాహేతర సంబంధాలు వంటివి ఉంటున్నాయి. వరకట్నానికి వ్యతిరేకంగా అనేక చట్టాలున్నా.. ఈ విష సంస్కృతి అంతకంతకూ పెరుగుతోందంటే అర్థమేంటి? సమాజం ఏం చేస్తోంది?
ఇటీవల కాలంలో భార్యలపై భర్తల నిఘా, అనుమానాలు మితిమీరిపోతున్నాయి. లేని పోని అనుమానాలు పెట్టుకుని భార్యలను హింసిస్తున్నారు. చివరకు ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటం లేదు. అందులోనూ.. ఎన్నో ఏళ్ల పగతో రగిలిపోతున్న వాళ్లలా.. అతికిరాతకమైన పద్ధతుల్లో చంపేస్తున్నారు. మేడిపల్లి ఘటనలో.. ప్రేమించిన వ్యక్తి తల కోసి.. రంపంతో భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయడం.. భర్త మానసిక పరిస్థితి మృగం కంటే ఎంత క్రూరంగా ఉందో, అతడి మానసిక స్థితి ఎలా ఉందో.. అర్థం చేసుకోవచ్చు.
మగవాళ్ల ప్రవర్తనలో ఈ మార్పులెందుకు..
మెంటల్ డిజార్డర్లు, మానసిక ఒత్తిడి, బాధపడితే సమాజంలో చులకన అయిపోతామనే భావన, కుటుంబ పరిస్థితులు.. మగవాళ్ల ప్రవర్తనలో మార్పులకు దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న పట్టణీకరణ, ఆధునికీకరణ, జీవనశైలి, ఆర్థిక సమస్యలు.. పురుషుల్లో ఒత్తిడి, యాంక్సైటీ, డిప్రెషన్కు కారణమవుతున్నాయట. వీటిని తట్టుకునేందుకు సమాజ మద్దతు పురుషులకు లభించడం లేదనే వాదన కూడా ఉంది. అంటే మానసికంగా కుంగిపోయిన వారికి సరైన చికిత్స వ్యవస్థలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టని.. ప్రభుత్వ తప్పిదాలు కూడా ఇందుకు తోడవుతున్నాయనే వాదనా ఉంది.
2020లో ల్యాన్సెట్ జర్నల్లో పబ్లిష్ అయిన.. "ది బర్డెన్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ అక్రాస్ స్టేట్స్ ఇన్ ఇండియా : ది గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ 1990–2017" నివేదిక ప్రకారం.. డిప్రెసివ్ డిజార్డర్లు ఉన్న మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. 27 ఏళ్ల కేసులు అధ్యయనం చేసి ఈ రిపోర్టు ఇచ్చారు. దీని ప్రకారం (2020 నాటికి) ప్రతి ఏడుగురు భారతీయుల్లో ఒకరు మానసికంగా కుంగిపోతున్నారట. అంటే మన చుట్టూనే ఇలా ప్రవర్తించే మానసిక రోగులు ఎంతో మంది ఉండే ఉంటారు. భార్యలను కిరాతకంగా చంపిన వాళ్లలో కూడా ఇలాంటివారు ఉండే అవకాశమూ లేకపోలేదు.
ప్రేమ వివాహాల్లో కూడా.. ఎందుకిలా?
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యలను కూడా చంపేస్తున్నారు కొందరు మృగాళ్లు. చిన్న వయసులో ఆకర్షణను ప్రేమ అనుకోవడం.. పెళ్లి, కుటుంబ బాధ్యతలను మొదటగా తెలుసుకోలేకపోతున్నారు. పెళ్లైన తర్వాత వీటన్నింటి ఒత్తిడి వల్ల.. వీరి మానసిక స్థితి దిగజారుతోంది. అలా భార్యలు చేసిన పనులకు చిరాకు పడటం, వారిపై ఆంక్షలు పెట్టడం, అనుమానాలు పెంచుకోవడానికి దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇక పెళ్లై.. ఐదేళ్లు, పదేళ్లు గడిచిన వాళ్లు కూడా.. ఆర్థిక సమస్యలు, కుటుంబంలో గొడవలు, చెప్పుడు మాటల కారణంగా భార్యలపై అనుమానాలు పెంచుకుంటున్నారు. అయితే నిజా నిజాలు ఎలా ఉన్నా... ఇలాంటి చాలా కేసుల్లో భార్యలను చంపిన వారు.. ఆధారాలు లేకుండా, ఊహాగానాలతోనే అనుమానాలు పెంచుకుంటున్నారని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేరాల్లో సమాజం, ప్రభుత్వం పాత్ర ఏమిటి?
ప్రస్తుతం సమాజంలో విలువలు మంటకలిసిపోతున్నాయి. దీనికి ప్రజలు, ప్రభుత్వం, వ్యవస్థలు, సంస్థలు కూడా కారణమవుతున్నాయి. పాఠశాల స్థాయి నుంచే మగ పిల్లల్లో ప్రవర్తన మారుతోంది. మద్యం, గంజాయికి అలవాటు పడుతున్నారు. తెలంగాణలో గంజాయి మారుమూల పల్లెల్లోకి ఎలా పాకిందో అందరికీ తెలిసిందే. ఇక కుటుంబాల్లో ఉన్న పరిస్థితి కూడా చిన్నతనంలో అభద్రతా భావం ఏర్పడటానికి కారణమవుతోంది. ఇతరులతో ప్రేమ, ఆప్యాయత, జాలి, దయతో మెలగాలన్న పరిస్థితి సమాజంలో కనపడటం లేదు. పెరుగుతున్న ఆర్థిక, సమాజిక అసమానతలు కూడా.. ఈ పరిస్థితికి పరోక్షంగా కారణం అవుతున్నాయి.
మరోవైపు, మానసికంగా బాధపడుతున్న వారిని చికిత్స అందించే వ్యవస్థలు కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోతున్నాయి. అవగాహన కార్యక్రమాలు కూడా సరిగా నిర్వహించడం లేదు. ఇలాంటి వారిలో 70 నుంచి 90 శాతం మందికి చికిత్స అందడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో లక్ష మందికి 0.75 మంది మానసిక వైద్య నిపుణులు ఉన్నారు. ప్రపంచం ఆరోగ్య సంస్థ ప్రకారం ముగ్గురు ఉండాలి. మానసిక వైద్యుల వద్దకు వెళ్లాలన్నా.. నామోషీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో సైకోలు స్వైర విహారం చేయకుండా ఎలా ఉంటారు?
వ్యక్తి నుంచి వ్యవస్థ వరకు ఇలా పలు రకాల కారణాల వల్లే.. ఈ స్థాయిలో నేరాలు పెరిగిపోతున్నాయి! ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఈ పరిస్థితి మంచిది కాదు. ఇప్పటికే విడాకులతో వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంటే.. ఇలా కట్టుకున్న వాళ్ల హత్యలతో మరింత దిగజారుతోంది. ఇది రానున్న తరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ ఎక్కడో ఒకచోట జరిగిన ఒంటరి సంఘటనలు అనుకుంటే పొరపాటే. సమాజంలో పెరుగుతున్న విపరీత ధోరణులకు ఈ పరిస్థితి అద్దం పడుతోంది. అందరూ కలిసి ఆలోచిస్తేనే, ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయగలం..!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa