పశ్చిమ్ బెంగాల్లో రాజకీయ ప్రకంపనలు రేపుతోన్న టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులు నివాసాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ముర్షిదాబాద్ జిల్లాలో ఈడీ అధికారుల నుంచి తప్పించుకోడానికి టీఎంసీ ఎమ్మెల్యే ఒకరు ప్రయత్నించాడు. తన మొబైల్ ఫోను చెరువులో విసిరేసి, గోడదూకి పారిపోయేందుకు యత్నించి, చివరకు దొరికిపోయాడు. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా నివాసం, ఆయనకు సంబంధించిన పలు ప్రదేశాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు సైతం మమత బెనర్జీకి షాకిచ్చింది.
ఈ విషయం గురించి తెలుసుకున్న సదరు ఎమ్మెల్యే తప్పించుకోవాలని భావించారు. దీంతో తన ఇంటి మొదటి అంతస్తుపై నుంచి కిందకు దూకిన ఆయన.. పక్కనే ఉన్న గోడపై నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే బయట కాచుకుని ఉన్న అధికారులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆధారాలను దొరక్కుండా చేయడానికి తన మొబైల్ ఫోన్ను సమీపంలోని చెరువులోకి విసిరేసినట్లు అధికారులు గుర్తించారు. మరో రెండు మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కాల్ డేటా విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు చెప్పారు.
అయితే, గోడదూకి ఎందుకు పారిపోయే ప్రయత్నం చేశారనే విషయంపై ఎమ్మెల్యే కృష్ణ సాహాను విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అనంతరం కోల్కతాలోని ఈడీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే మామగారి చెందిన ఇళ్లలోనూ సోదాలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. టీచర్ రిక్రూట్మెంట్ కేసులో కృష్ణ సాహాను సీబీఐ అధికారులు ఏప్రిల్ 2023లో అరెస్టు చేయగా.. ఈ ఏడాది మేలో ఆయనకు బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ, గ్రూప్ సి, డి సిబ్బంది నియామకాల కోసం 24,650 ఖాళీల భర్తీకి 2016లో పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. రాష్ట్ర స్థాయిలో ఎంపిక పరీక్షను నిర్వహించగా.. మొత్తం 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ రాత పరీక్షలో అర్హత సాధించిన 25,753 మందికి ఉద్యోగ నియమాక పత్రాలను అందజేశారు. కానీ, నియమాకాల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలతో న్యాయస్థానాన్ని పలువురి ఆశ్రయించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టగా.. అవకతవకలు జరిగినట్టు నిర్దారణ అయ్యింది. 2024లో కోల్కతా హైకోర్టు నియమాక ప్రక్రియను రద్దుచేయగా.. బెంగాల్ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లింది. కానీ, అక్కడ కూడా మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దిగువ కోర్టు తీర్పును సమర్దించింది. ఎంపికైన అందర్నీ అనర్హులుగా ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa