ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్త్రీ శక్తి పథకం విజయవంతం చేసిన మహిళలకు చంద్రబాబు ధన్యవాదాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 09:01 PM

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం ప్రవేశపెట్టిన 'స్త్రీ శక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకానికి మరో కీలకమైన సాంకేతిక హంగు చేరనుంది. ఇకపై మహిళలు బస్టాపుల్లో బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, తమ స్మార్ట్‌ఫోన్లలోనే బస్సు ఎక్కడుందో తెలుసుకునేలా 'లైవ్ ట్రాకింగ్' వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు సచివాలయంలో ఆర్టీసీ పనితీరుపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే, మహిళలు తమ ప్రయాణ సమయాన్ని కచ్చితంగా ప్లాన్ చేసుకోవడానికి వీలు కలుగుతుందని, ఇది వారి సమయాన్ని ఆదా చేయడమే కాకుండా భద్రతను కూడా పెంచుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.లైవ్ ట్రాకింగ్ విధానాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించగా, రాబోయే రెండు మూడు రోజుల్లోనే గుంటూరు డిపో పరిధిలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామని ఆర్టీసీ అధికారులు బదులిచ్చారు. అక్కడి ఫలితాలను బట్టి, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్త్రీ శక్తి బస్సులకు ఈ సదుపాయాన్ని విస్తరిస్తామని వారు ముఖ్యమంత్రికి వివరించారు. దీనితో పాటు, స్త్రీ శక్తి పథకం కింద నడుస్తున్న 8,458 బస్సులకు స్పష్టంగా కనిపించేలా ముందు, వెనుక భాగాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు సంయమనంతో వ్యవహరించాలని ఆర్టీసీ సిబ్బందికి ఆయన సూచించారు.'స్త్రీ శక్తి' పథకం అమలుపై ముఖ్యమంత్రి ఆరా తీయగా, ఇది అద్భుతమైన విజయం సాధించిందని అధికారులు తెలిపారు. పథకం ప్రారంభానికి ముందు ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 68 నుంచి 70 శాతం మధ్య ఉండేదని, ఇప్పుడు రాష్ట్రంలోని 60 డిపోల పరిధిలో బస్సులు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని వివరించారు. మహిళా ప్రయాణికుల సంఖ్య 40 శాతం నుంచి ఏకంగా 65 శాతానికి పెరిగిందని గణాంకాలతో సహా తెలిపారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర మహిళలు ఎంతో చైతన్యవంతులని, ప్రభుత్వ పథకాలను బాధ్యతాయుతంగా సద్వినియోగం చేసుకుంటున్నారని ప్రశంసించారు. "రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని, అవసరమైతేనే ప్రయాణాలు చేస్తూ మహిళలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. వారి సహకారంతోనే ఈ పథకం ఇంత పెద్ద విజయం సాధించింది. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని అన్నారు. గతంలో డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తే, ఇప్పుడు స్త్రీ శక్తి ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చామని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల విద్యార్థినులు, మహిళలకు బస్ పాసుల కోసం క్యూ లైన్లలో నిలబడే శ్రమ తప్పిందని, ఆర్టీసీలో సురక్షితమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్షలో భాగంగా ఆర్టిక్యులేటెడ్ ఈ-బస్సుల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa