ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసియా కప్‌లో టీమిండియానే ఫేవరెట్ అన్న సెహ్వాగ్

sports |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 07:02 PM

ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టే టైటిల్ గెలుస్తుందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టోర్నీలో పాల్గొంటున్న జట్లలో మనదే అత్యుత్తమ జట్టు అని, కప్‌ను నిలబెట్టుకోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పాడు.ఆసియా కప్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన సెహ్వాగ్, భారత జట్టు సత్తాపై పూర్తి విశ్వాసం కనబరిచాడు. "మనం ప్రపంచ ఛాంపియన్లం. ఇటీవలే టీ20 ప్రపంచకప్ గెలిచాం. కాబట్టి ఆసియా కప్‌లో మనమే అత్యుత్తమ జట్టు అని నేను కచ్చితంగా చెప్పగలను. ఈసారి కూడా టైటిల్ మనమే గెలుస్తామని ఆశిస్తున్నాను" అని అన్నాడు.సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీని సెహ్వాగ్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. "మనకు చాలా మంచి జట్టు ఉంది. కెప్టెన్‌గా సూర్య ముందుండి నడిపిస్తున్నాడు. అతను టీ20 ఫార్మాట్‌లో ఓ టాప్ ప్లేయర్. గతంలో స్కై కెప్టెన్సీలో మనం ఎన్నో టీ20 మ్యాచ్‌లు గెలిచాం. అతని నాయకత్వంలో ఈసారి కూడా అద్భుతంగా రాణిస్తామని, ఆసియా కప్ గెలుస్తామని నమ్ముతున్నాను" అని వివరించాడు.2026లో భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యేందుకు ఈ ఆసియా కప్ ఒక గొప్ప అవకాశమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. "ఈ టోర్నీ ద్వారా కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వొచ్చు. ప్రపంచకప్ కోసం జట్టును సిద్ధం చేసుకోవచ్చు. మన బలాన్ని పరీక్షించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఉండదు" అని తెలిపాడు. జట్టు ఎంపికపై వస్తున్న విమర్శలను పక్కనపెడుతూ, సెలక్టర్లు అత్యుత్తమ జట్టునే ఎంపిక చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు.యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. గ్రూప్-ఏలో ఉన్న భారత్, సెప్టెంబర్ 10న యూఏఈతో తొలి మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో, 19న ఒమన్‌తో తలపడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa