ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆటగాళ్లు, అభిమానులు హద్దులు దాటొద్దని సూచించిన వసీం అక్రమ్

sports |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 07:52 AM

ఆసియా కప్ 2025లో భాగంగా దాయాదులైన భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పౌరుల మృతికి కారణమైన ఘోర ఉగ్రదాడి అనంతరం ఇరు జట్ల మధ్య ఇదే తొలి క్రికెట్ పోరు కావడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ స్పందిస్తూ.. ఆటగాళ్లు, అభిమానులు సంయమనం పాటించాలని కీలక సూచనలు చేశాడు.ఈ హైవోల్టేజ్ మ్యాచ్ గురించి టెలికాం ఆసియా స్పోర్ట్‌తో వసీం అక్రమ్ మాట్లాడాడు. "ఎప్పటిలాగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లు ఎంతో ఆసక్తికరంగా సాగుతాయని నేను భావిస్తున్నాను. అయితే ఈసారి ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా హద్దులు దాటకుండా క్రమశిక్షణతో ఉంటారని ఆశిస్తున్నాను. భారతీయులు తమ జట్టు గెలవాలని ఎంత దేశభక్తితో కోరుకుంటారో, పాకిస్థాన్ అభిమానులు కూడా అంతే బలంగా ఆకాంక్షిస్తారు" అని ఆయన తెలిపాడు.ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందని అక్రమ్ విశ్లేషించాడు. "ఇటీవలి కాలంలో భారత జట్టు మెరుగైన ఫామ్‌లో ఉంది. కాబట్టి వారికే విజయావకాశాలు ఎక్కువ. కానీ ఇలాంటి కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని ఏ జట్టు అయితే సమర్థంగా ఎదుర్కొంటుందో, ఆ జట్టే విజయం సాధిస్తుంది" అని ఆయన అభిప్రాయపడ్డాడు.సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమన్‌తో తలపడనుంది. టోర్నమెంట్‌లోని సూపర్ 4 దశ మ్యాచ్‌లు సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు జరగనుండగా, ఫైనల్ పోరు సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa