ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలిసారి ఉక్రెయిన్‌పై సముద్ర డ్రోన్‌తో రష్యా దాడి

international |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 09:47 PM

ఓవైపు, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తుంటే.. ఇంకోవైపు ఇరు దేశాలూ పరస్పరం భీకర దాడులు చేసుకుంటూ ఉద్రిక్తతలు రోజురోజుకూ పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడికి దిగింది. ఈ దాడిలో కీవ్‌కు భారీ నష్టం వాటిల్లింది. మాస్కో తొలిసారి సముద్ర డ్రోన్‌ దాడిచేయగా.. ఉక్రెయిన్‌కు చెందిన అతిపెద్ద నిఘా నౌక పూర్తిగా ధ్వంసమైంది. దాడి అనంతరం నౌక మంటల్లో చిక్కుకుని, సముద్రంలో ముగినిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, గత నెలలో అలాస్కా వేదికగా రష్యా, అమెరికా అధ్యక్షులు భేటీ జరిగింది. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ వాషింగ్టన్ డీసికి వెళ్లి ట్రంప్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే.


ఒడెస్సా రీజియన్‌లోని డాన్యూబ్ నదిలో ఉక్రెయిన్ మోహరించిన నిఘా నౌక సింఫెరోపోల్‌పై సముద్ర డ్రోన్‌ను రష్యా ప్రయోగించింది. తమ దాడిలో ఉక్రెయిన్ నిఘా నౌక ధ్వంసమై మునిగిపోయిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ దాడిని కీవ్ కూడా ధ్రువీకరిస్తూ.. నౌకలోని సిబ్బంది ఒకరు చనిపోయారని, కొందరు గాయపడ్డారని తెలిపింది. గల్లంతైన వారికి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొంది. ప్రాణనష్టం స్వల్పమేనని వివరించింది.


ఉక్రెయిన్ నేవీ చెందిన నిఘా నౌక సింఫెరోపోల్.. గత దశాబ్ద కాలంలో ఆ దేశం ప్రారంభించిన అతిపెద్ద నౌక అయిన సింఫెరోపోల్‌ను 2019లో ఆవిష్కరించగా.. రెండేళ్ల తర్వాత 2021లో నౌకాదళంలో చేరింది. రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్, ఆప్టికల్ రీకన్నాస్సెన్స్‌ కోసం రూపొందంచిన ఇది లగూనా క్లాస్‌కి చెందిన మధ్యశ్రేణి నౌక.


కాగా, ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా సైన్యం చేపట్టిన మొట్టమొదటి సముద్ర డ్రోన్ దాడి ఇదేనని నిపుణులను ఉటంకిస్తూ టాస్ నివేదించింది. మరోవైపు, మాస్కో-కీవ్ మధ్య దాడులు ఉద్ధృతమయ్యాయి. గడచిన రెండు రోజులుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ సహా పలు నగరాలపై రష్యా వందలాది డ్రోన్లు, పదుల సంఖ్యలో క్షిపణులతో భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 17 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో 48 మంది గాయపడ్డారు. మరోవైపు, రష్యా నంచి చమురు కొనుగోలు చేస్తూ.. యుద్ధానికి నిధులు అందిస్తోందని భారత్‌పై అమెరికా పదే పదే విమర్శలు చేస్తోంది.


ఇటీవలి నెలల్లో రష్యా సముద్ర డ్రోన్‌ల తయారీ వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంది. అలాగే యుద్ధంలో ఆధిపత్యం చెలాయించే ఇతర మానవరహిత వ్యవస్థలు కూడా మాస్కో వద్ద ఉన్నాయి. రష్యా రాత్రి సమయంలో చేసిన దాడుల్లో రెండు క్షిపణులు కీవ్‌లోని ఒక ప్రధాన డ్రోన్ వ్యవస్థను కూడా తాకిందని ఉక్రేనియన్ నేత ఇగోర్ జింకెవిచ్ అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa