ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్లు చెదిరే మొత్తాలు.. టీటీడీకి హైదరాబాద్ సంస్థల భారీ విరాళాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 31, 2025, 02:52 PM

తిరుమల శ్రీవారికి ఆదివారం భారీ విరాళాలు అందాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే టీటీడీ బర్డ్ ట్రస్టుకు ఆదివారం రోజున హైదరాబాద్‌కు చెందిన రెండు సంస్థలు భారీ విరాళాలు అందించాయి. ఆర్.ఎస్.బి రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ అనే సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్టుకు ఆదివారం రూ.2,92,91,840 ( సుమారుగా రూ.2.93 కోట్లు) విరాళంగా అందించింది. ఇదే సమయంలో హైదరాబాద్‌కు చెందిన ఆర్.ఎస్.బ్రదర్స్ జ్యూవెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. బర్డ్ ట్రస్ట్ కు1.10 కోట్ల రూపాయలు విరాళంగా సమర్పించింది.


ఆయా సంస్థ ఎండీలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, టీటీడీ ఏఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిలను కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. మరోవైపు నర్సారావు పేటకు చెందిన జె.రామాంజనేయులు అనే భక్తుడు శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు ఆదివారం రోజున రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


ఎక్కువగా తినకపోయినా బరువు పెరుగుతున్నారా, కారణాలేంటో తెలుసా, కొన్ని అలవాట్లని దూరం చేసుకుంటే అసలు బరువు పెరగరు


మరోవైపు తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో సెప్టెంబర్ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబరు 6, 13, 20, 27వ తేదీల్లో ఉదయం 6 గంటలకు సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం కార్యక్రమాలు ఉంటాయి. సెప్టెంబరు 7వ తేదీ పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం జరగనుంది. అలాగే చంద్రగ్రహణం సందర్భంగా సెప్టెంబర్ ఏడో తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కోదండ రామాలయం మూసివేయనున్నారు.


పునర్వసు నక్షత్రం సందర్భంగా సెప్టెంబరు 17వ తేదీ ఉదయం 11 గంటలకుసీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల గుండా రామచంద్ర పుష్కరిణి వరకూ ఊరేగిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ ఉంటుంది. ఇక సెప్టెంబరు 21వ తేదీ అమావాస్య కావటంతో ఆ రోజు ఉదయం 9 గంటలకు సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ ఉంటుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది


మరోవైపు అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలోనూ సెప్టెంబర్ నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబ‌రు రెండో తేదీ ఉద‌యం 8 గంట‌లకు అష్టదళ పాదపద్మారాధన సేవ, శ్రవణ నక్షత్రం సందర్బంగా సెప్టెంబ‌రు 5న ఉదయం 10.30. గంట‌లకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. అలాగే సెప్టెంబ‌రు 5, 12, 26వ‌ తేదీలలో ఉద‌యం 7 గంట‌లకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం కార్యక్రమాలు ఉంటాయి. సెప్టెంబ‌రు 10వ తేదీ ఉదయం 8 గంట‌లకు అష్టోత్తర శత కలశాభిషేకం ఉంటుంది. అలాగే సెప్టెంబ‌రు 7, 14, 21, 28వ‌ తేదీలలో ఉద‌యం 8.15 గంట‌లకు స్వామివారికి అభిషేకం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa