ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన వ్యవహారం మళ్లీ తెర మీదకు వచ్చింది. కూటమి ప్రభుత్వం ఈ అంశంపై మరోసారి కసరత్తు చేస్తోంది. గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. జిల్లాలను సరిగా విభజించలేదని.. అనేక సమస్యలు తలెత్తుతున్నాయని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాల విభజన సరిగా లేనందున ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని కూటమి ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈక్రమంలో సమస్యల పరిష్కారం కోసం.. అలానే పరిపాలన సౌలభ్యంగా ఉండాలని, ప్రజలకు సౌకర్యంగా ఉండాలని జిల్లాల సరిహద్దులు, పేర్లు, కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీని కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం.. ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటోంది.
ఈ క్రమంలో శ్రీశైలానికి సంబంధించి సరికొత్త వివాదం తెర మీదకు వచ్చింది. శ్రీశైల ఆలయాన్ని.. త్వరలోనే కొత్తగా ఏర్పాటు చేయబోయే మార్కాపురం జిల్లాలో కలపబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ఆలయం నంద్యాల జిల్లాలో ఉంది. గతంలో ఇది కర్నూలు జిల్లాలో ఉండేది. అయితే వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు శ్రీశైలం ఆలయం కర్నూలు జిల్లా నుంచి నంద్యాల జిల్లాలోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్లీ దీనిని మార్కాపురం జిల్లాలో కలుపుతారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. దీనిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈఅంశంపై ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. శ్రీశైలం ఆలయాన్ని తరచుగా వివాదాల్లోకి లాగడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన శ్రీశైలం అంశం మీద స్పందిస్తూ.. కొంతమంది కావాలనే రెండు జిల్లాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు. శ్రీశైలం ఆలయాన్ని వివాదాల్లోకి లాగవద్దని సూచించారు. ప్రస్తుతం ఏ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలు.. అవే జిల్లాల్లో ఉంటాయని తెలిపారు. అలానే మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి ప్రాంతాలతో మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని ఆయన తెలిపారు.
అలానే శ్రీశైలాన్ని మార్కాపురంలో కలపాలన్న ప్రతిపాదన లేదని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి వస్తున్న ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ విషయంపై రెండు జిల్లాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa