రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక వినాయక చవితి అంటే ఎక్కువగా వినిపించేది వేలం పాట. నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తర్వాత.. వినాయకుడి కోసం వినియోగించిన లడ్డూ, వస్త్రం, కలశం వంటి వాటికి వేలం పాట నిర్వహిస్తుంటారు. ఈ వేలం పాటలు కొన్ని సార్లు ప్రత్యేక రికార్డులు క్రియేట్ చేస్తుంటాయి. ఇక తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వినాయకుడి విగ్రహాన్ని వేలం వేశారు. అది కాస్త సుమారు 2.39 లక్షల రూపాయలు పలికింది. అది కూడా మట్టి విగ్రహం కావడం గమనార్హం. ఆ వివరాలు..
తూర్పు గోదావరి జిల్లా.. ఉండ్రాజవరం మండలంలో ఈ అరుదైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉండ్రాజవరంలోని చివటంలో పూజలో పెట్టిన మట్టి గణపతి విగ్రహానికి శనివారం వేలం పాట నిర్వహించారు. అయితే అనూహ్య రీతిలో ఈ మట్టి వినాయకుడి విగ్రహం.. ఏకంగా రెండు లక్షల రూపాయలకు పైగా పలికి ఆశ్చర్యపరిచింది.
పూజలో పెట్టిన ఈ వినాయక విగ్రహానికి శనివారం నాడు నిర్వాహకులు వేలం పాట నిర్వహించారు. ఈ క్రమంలో చిలుకూరి శ్రీనివాసు అనే స్థానికుడు రూ. 2.39 లక్షలకు వినాయకుడి మట్టి విగ్రహాన్ని దక్కించుకున్నారు. విగ్రహాన్ని దక్కించుకున్న వ్యక్తి.. తొమ్మిది రోజులపాటు స్వామి వారికి పూజలు చేస్తారని.. ఆ తర్వాత వేలం పాట ద్వారా సమకూరిన మొత్తాన్ని వినాయక నిమజ్జనోత్సవానికి వినియోగిస్తారని గ్రామస్థులు తెలిపారు. విగ్రహాన్ని దక్కించుకున్న వ్యక్తి శ్రీనివాసు మాట్లాడుతూ.. వినాయకుడి దయ వల్లే తనకు ఈ అదృష్టం దక్కిందన్నారు.
ఇదిలా ఉంటే.. ఏపీలోని ఓ ప్రాంతం.. హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ వేలం పాటకు పోటీగా వచ్చింది. ప్రకాశం జిల్లాలో ఓ చోట వినాయకుడి పూజలో పెట్టిన లడ్డూ భారీ ధర పలికింది. లడ్డూ, కలశం రెండు కలిపి సుమారు 49.10 లక్షల రూపాయలు పలికింది. జిల్లాలోని సీఎస్పురం మండలం అయ్యలూరివారిపల్లిలో వినాయక మండపంలో ఉంచిన లడ్డూతో పాటుగా కలశానికి కూడా తాజాగా వేలం పాట నిర్వహించారు. లడ్డూ, కలశం రెండింటిని.. వేర్వేరు వ్యక్తులు వేలం పాట ద్వారా దక్కించుకున్నారు. ఇద్దరూ వ్యక్తులు కలిసి.. లడ్డూ, కలశం రెండింటిని కలిపి ఏకంగా రూ.49.10 లక్షలకు వేలం పాట పాడి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మట్టి వినాయక విగ్రహం ఏకంగా 2.39 లక్షల రూపాయలు పలకడం సంచలనంగా మారింది. ఈ వార్త స్థానికంగా వైరల్గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa