జమ్మూ కాశ్మీర్లోని గురేజ్ సెక్టార్లో గత శనివారం రోజు జరిగిన పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అందులో ఒకరు మానవ జీపీఎస్గా పేరొందిన బాగూఖాన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సరిహద్దుల గురించి పూర్తి అవగాహన ఉండటం వల్ల అతనికి ఈ పేరు వచ్చింది. దశాబ్దాలుగా భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్న బాగూఖాన్.. వంద మందికి పైగా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సహాయం చేశాడు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రవాదా బాగుఖాన్ను సముందర్ చావా అని కూడా పిలుస్తుంటారు. 1995 నుంచి వందకు పైగా ఉగ్రవాదుల చొరబాట్లలో ఇతడు కీలక పాత్ర పోషించాడు. ఇతనికి నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఉన్న అన్ని రహస్య మార్గాలు తెలుసునని.. వాటి ద్వారా భద్రతా దళాల కంటపడకుండా ఉగ్రవాదులను దేశంలోకి పంపగలడని అధికారులు తెలిపారు. ఇంతటి నైపుణ్యం కారణంగానే అతనికి 'మానవ జీపీఎస్' అనే పేరు వచ్చింది. ఎన్కౌంటర్ అనంతరం అతని వద్ద లభించిన గుర్తింపు కార్డు ప్రకారం.. అతను పాకిస్థాన్ పౌరుడని తేలింది. ఈ దారుణమైన ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నాడని కూడా నిఘా వర్గాలు వెల్లడించాయి.
నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు విఫలం చేసిన సమయంలో.. అంటే ఆగస్టు 23వ తేదీన బాగూఖాన్ హతమయ్యాడు. సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి గురేజ్ సెక్టార్లో ఒక ఉమ్మడి ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా అప్రమత్తంగా ఉన్న సైనికులు అనుమానాస్పద కదలికలను గమనించి, చొరబాటుదారులను అప్రమత్తం చేశారు.
దీంతో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. సైన్యం కూడా దీటుగా స్పందించి వారిపై ఎదురు కాల్పులు జరిపింది. ఈ ఎదురుకాల్పుల్లో బాగూఖాన్తో పాటు మరో ఉగ్రవాదిని భారత బలగాలు మట్టుబెట్టాయి. ఇదే విషయాన్ని శ్రీనగర్లోని ఆర్మీ చినార్ కార్ప్స్ ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్టు ద్వారా తెలిపింది.
'మానవ జీపీఎస్' మరణం ఉగ్రవాద సంస్థలకు ఒక పెద్ద దెబ్బ అని భద్రతా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అతని మరణంతో పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. సరిహద్దుల్లోని భూభాగం గురించి అతనికి ఉన్న అపారమైన జ్ఞానం, దశాబ్దాలుగా ఉగ్రవాదులకు ఒక విలువైన వనరుగా ఉండేది. అతన్ని హతమార్చడం వల్ల ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ఇప్పుడు కొత్త మార్గాలను, వ్యూహాలను వెతుక్కోవాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa