ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వీధి కుక్కల వల్లే నాకు గుర్తింపు వచ్చింది': సుప్రీంకోర్టు న్యాయమూర్తి విక్రమ్ నాథ్

national |  Suryaa Desk  | Published : Sun, Aug 31, 2025, 03:57 PM

 సుప్రీం కోర్టు న్యాయమూర్తి విక్రమ్ నాథ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. వీధి కుక్కల కేసుల వల్ల తనకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని అన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA), కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ  సంయుక్తంగా ఏర్పాటు చేసిన మానవ-వన్యప్రాణుల సంఘర్షణ మరియు సహజీవనంపై జరిగిన ప్రాంతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


జస్టిస్ నాథ్ అధ్యక్షతన ఉన్న సుప్రీం కోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గత వారం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని వీధి కుక్కలను స్టెరిలైజేషన్ తర్వాత షెల్టర్లలోనే ఉంచాలని గతంలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ నాథ్ ధర్మాసనం నిలిపి వేసింది. వీధి కుక్కలకు వ్యాక్సిన్, స్టెరిలైజేషన్ తర్వాత వాటిని పట్టుకున్న ప్రదేశంలోనే తిరిగి వదిలివేయాలని మూడు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది.


 సదస్సులో తన ప్రసంగాన్ని హాస్యంతో ప్రారంభించిన జస్టిస్ నాథ్.. “ఇప్పటి వరకు నేను న్యాయవాద వర్గాల్లో చేసిన పని కొద్దిపాటి మాత్రమే గుర్తింపు పొందాను. కానీ వీధి కుక్కల కేసు వల్లే నాకు ఈ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సివిల్ సొసైటీలో గుర్తింపు వచ్చింది. ఈ కేసును నాకు కేటాయించినందుకు నా ప్రధాన న్యాయమూర్తికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.


లా ఆసియా పోలా సదస్సును ప్రస్తావిస్తూ జస్టిస్ నాథ్.. సదస్సుల వివిధ దేశాల న్యాయవాదులు, న్యాయవాదుల అధ్యక్షులు కూడా ఉన్నారని గుర్తు చేశారు. వారంతా వీధి కుక్కల కేసు గురించి నన్ను ప్రశ్నలు అడగటం ప్రారంభించారన్నారు. భారతదేశం బయట కూడా నన్ను ప్రజలు గుర్తిస్తున్నారని తెలిసి నాకు చాలా సంతోషం కలిగిందని చెప్పారు. అందుకే నాకు ఈ గుర్తింపును ఇచ్చినందుకు వీధి కుక్కలకు నేను కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అంతేకాకుండా.. మనుషులు ఇచ్చే దీవెనలు, శుభాకాంక్షలతో పాటు వీధి కుక్కలు కూడా నాకు ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయని నాకు మెసేజ్‌లు వస్తున్నాయన్నారు. మనుషుల ఆశీర్వాదాలతో పాటు వాటి ఆశీర్వాదాలు కూడా నాకు ఉన్నాయని ఆయన నవ్వుతూ చెప్పారు.


మనుషులు, వన్యప్రాణుల మధ్య సహజీవనం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ.. మానవులు శతాబ్దాలుగా వన్యప్రాణులు, ప్రకృతితో కలిసి జీవించారని జస్టిస్ నాథ్ గుర్తు చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ విధానానికి మనం దూరమయ్యామని చెప్పుకొచ్చారు. దాని ఫలితమే ప్రస్తుతం సంఘర్షణకు దారితీసిందని వివరించారు. అయితే ఈ సంఘర్షణలకు పరిష్కారాలను కనుగొనడానికి మన రాజ్యాంగం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం జస్టిస్ నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa