ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిన్‌పింగ్‌తో మోదీ భేటీ.. భారత్-చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Sun, Aug 31, 2025, 03:56 PM

ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తోన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. తనను ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భారత్-చైనా సంబంధాలను పరస్పర నమ్మకం, గౌరవం, సున్నితత్వంతో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. 280 కోట్ల మంది భారతీయులు, చైనీయుల నమ్మకంపై సంబంధాలు ఆధారపడి ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. అంతేకాదు, సైన్యాల ఉపసంహరణ తర్వాత సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకుందని వ్యాఖ్యానించారు. జపాన్ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ అటు నుంచి అటే చైనాకు వెళ్లారు.


‘‘గతేడాది కజాన్‌లో మేము చాలా ఫలవంతమైన చర్చలు జరిపాం.. ఇది మా సంబంధాలకు సానుకూల దిశానిర్దేశం చేసింది.. సరిహద్దులో సైన్యాల మళ్లింపు తర్వాత శాంతి, స్థిరత్వం వాతావరణం నెలకుంది’’ అని ఆయన అన్నారు. రష్యాలోని కజాన్‌లో జరిగిన 2024 బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన మోదీ.. అక్కడ చైనా అధ్యక్షుడితో సమావేశమైన విషయం తెలిసిందే. ఐదేళ్ల తర్వాత మొదలైన కైలాస మానసరోవర యాత్ర, భారత్-చైనాల మధ్య విమాన రాకపోకల గురించి ప్రధాని మాట్లాడారు.


‘‘రెండు దేశాలలోని 2.8 బిలియన్ల ప్రజల ప్రయోజనాలు మన సహకారంతో ముడిపడి ఉన్నాయి. ఇది మొత్తం మానవాళి సంక్షేమానికి కూడా మార్గం సుగమం చేస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రతినిధి బృందం స్థాయి చర్చల సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రసంగిస్తూ.. ‘మిస్టర్ ప్రధాన మంత్రి మిమ్మల్ని మళ్లీ కలవడం చాలా ఆనందంగా ఉంది.. SCO శిఖరాగ్ర సమావేశానికి చైనాకు నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. గత సంవత్సరం, మనం కజాన్‌లో విజయవంతమైన సమావేశాన్ని నిర్వహించాం’ అని అన్నారు.


ఇక, జిన్‌పింగ్ మాట్లాడుతూ.. భారత్, చైనాలు స్నేహితులుగా, మంచి ఇరుగుపొరుగు దేశాలుగా ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. ‘ప్రపంచం మార్పులతో ముందుకెళ్తోంది..భారత్‌, చైనాలు పురాతన నాగరికతలు కలిగిన దేశాలు.. మనం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు.. గ్లోబల్ సౌత్‌లో భాగం... స్నేహితులుగా, మంచి పొరుగువారిగా ఉండటం, డ్రాగన్- ఏనుగు కలిసి నడవడం చాలా ముఖ్యం’ అని స్పష్టం చేశారు.


‘చైనా- భారత్ దౌత్య సంబంధాలు మొదలై ఈ ఏడాదితో 75 వసంతాలు.. ఇరు దేశాలూమన సంబంధాన్ని వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో నిర్వహించాలి’ అని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల ఘర్షణ అనంతరం.. భారత్, చైనా సంబంధాలు మరింత దిగజారాయి. ఐదేళ్ల తర్వాత మళ్లీ వివాదాలను పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa