అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంవత్సరం చివరలో భారతదేశంలో జరగాల్సిన క్వాడ్ సదస్సుకు హాజరు కావడం లేదని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. గత కొన్ని నెలలుగా ట్రంప్నకు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య సంబంధాలు క్షీణించాయని ఈ నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రంప్ 2025లో భారత పర్యటనకు వెళ్తానని చెప్పినప్పటికీ.. తాజాగా వాటిని విరమించుకున్నారని పేర్కొంది. అయితే రెండు దేశాల నుంచి ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక్క రోజు తర్వాతనే క్వాడ్ విదేశాంగ మంత్రులతో సమావేశం నిర్వహిచారు. ఇందుకు మోదీ కూడా హాజరయ్యారు. అయితే ఇక ఈ ఏడాది చివరలోనూ భారత్లో క్వాడ్ సదస్సు జరగాల్సి ఉంది. ఇందుకు ట్రంప్ హాజరు కాబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు. కానీ తాజాగా ఆయన ఈ సమావేశానికి డుమ్మా కొట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ట్రంప్, మోదీల మధ్య సంబంధాలు దెబ్బతినడమే కారణం అని నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మధ్య మే నెలలో జరిగి నాలుగు రోజుల ఘర్షణను తానే ఆపానని ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. ఈ వాదనలను ఢిల్లీ తీవ్రంగా ఖండించింది. భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో దేశం పాత్ర లేదని తేల్చి చెప్పింది.
కానీ ట్రంప్ మాత్రం దాదాపు 40 సార్లకు పైనే తాను యుద్ధాన్ని ఆపినట్లు ప్రకటించారు. ట్రంప్ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై మోదీ సహనం కోల్పోతున్నట్లు నివేదిక వివరించింది. అలాగే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై మోదీ స్పందించకపోవడం, అందులోనూ నోబెల్ శాంతి బహుమతికి చతన పేరును నామినేట్ చేయకపోవడంతో మోదీపై కోపం పెంచుకున్నారని కూడా చెప్పింది. ట్రంప్ మొదటి సారి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు మోదీతో స్నేహం బలంగా ఉందని.. కానీ ఇప్పుడు మాత్రం ఆ బంధం పూర్తిగా క్షీణించిందని తెలిపింది. ముఖ్యంగా సుంకాల విషయంలో కూడా ట్రంప్ భారత్పై పక్షపాతం చూపిస్తుండడంతో.. ఆయనకు ముఖం చెల్లడం లేదని అంతా భావిస్తున్నారు.
కెనడాలో జరిగిన G7 సదస్సుకు హాజరై తిరిగి వస్తున్నప్పుడు ట్రంప్.. ప్రధాని మోదీతో 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారు. ఈ సదస్సుకు మోదీ కూడా హాజరయ్యారు. ఈ ఇద్దరు నాయకులు సదస్సులో నేరుగా కలుసుకోవాల్సి ఉండగా.. ట్రంప్ ముందుగానే వెళ్లిపోవడంతో.. మోదీ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. ఆ కాల్లో ట్రంప్, వాషింగ్టన్లో ఆగి వెళ్లాలని మోదీని కోరారు. కానీ మోదీ క్రొయేషియాకు షెడ్యూల్ చేసిన పర్యటన ఉన్నందున ఆ అభ్యర్థనను తిరస్కరించారు. ఇక ఆ తర్వాత నుంచి అమెరికా భారత్పై సుంకాల విషయంలో గొడవ చేస్తూనే వచ్చింది. చివరకు 50 శాతం సుంకాలు విధించి కక్ష్య సాధిస్తోంది. అలాగే నాలుగు రోజుల క్రితం ట్రంప్ మోదీకి నాలుగు సార్లు ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయడం లేదంటూ వార్తలు వచ్చాయి. దీంతో కూడా ట్రంప్ ముఖం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యలన్నింటితో భారత్తో బంధం క్షీణించగా.. ట్రంప్ ఇండియాకు రావడానికి ఇష్టపడడం లేదని నివేదిక వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa