బీహార్లో మహా ఘట్బంధన్ కూటమి సీఎం అభ్యర్థి తానే అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు. ఆరా జిల్లాలో 'ఓట్ అధికార్ యాత్ర' కార్యక్రమంలోనే భాగంగా ఈ కామెంట్లు చేశారు. అయితే అప్పుడు రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారు. సీఎం అభ్యర్థిని తానేనంటూ తేజస్వీ యాదవ్ వారి సమక్షంలో ప్రకటించగా.. వారు మాత్రం చప్పుడు చేయలేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ మాత్రం దీనిపై నోరు మెదపలేదు. అలాగే నితీశ్ కుమార్ ప్రభుత్వంపై తేజస్వీ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ బీహార్లో ఆర్జేడీదే పైచేయి అని తెలిపారు.
మీకు కాపీ కొట్టే సీఎం కావాలా, ఒరిజినిల్ ముఖ్యమంత్రి కావాలా?
ఆరాలో జరిగిన ర్యాలీలో తేజస్వీ యాదవ్ మాట్లాడతూ.. తాను ప్రకటించిన సంక్షేమ పథకాలనే సీఎం నితీశ్ కుమార్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. "ముందు నేను వెళ్తుంటే ప్రభుత్వం వెనుక వస్తోంది" అని అన్నారు. ఈ సభలోనే ప్రజలను ఓ సూటి ప్రశ్న అడిగారు. "మీకు కాపీ కొట్టే సీఎం కావాలా? ఒరిజినల్ సీఎం కావాలా?" అంటూ ప్రశ్నించారు. అలాగే మహా ఘట్బంధన్ తరఫున సీఎం అభ్యర్థిని తానేనని తేజస్వి మరోసారి నొక్కి చెప్పారు. అయితే రెండోసారి చెప్పినప్పుడు కూడా రాహుల్ గాంధీ మౌనంగానే ఉండిపోయారు.
బీహార్లో కాంగ్రెస్ కంటే ఆర్జేడీ పెద్దన్న పాత్ర పోషిస్తుందని తేజస్వీ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కంటే తమ పార్టీకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. తేజస్వీ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ సమక్షంలోనే ఆయన ఈ కామెంట్లు చేయగా.. వీరిద్దరూ నోరు మెదపకపోవడం గమనార్హంగా నిలిచింది.
ముఖ్యంగా తేజస్వీ యాదవ్ మొదటి నుంచీ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని తప్పు పడుతూనే వస్తున్నారు. తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. పదవీ విరమణ వయసు 60 ఏళ్లేనని మరి 75 ఏళ్ల సీఎం అవసరమా అంటూ వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ సీఎం పదవి నుంచి తొలగిపోవాలంటూ పదే పదే డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa