ప్రముఖ తమిళ నటుడు సూర్యకు చెందిన ‘2డీ ఎంటర్టైన్మెంట్’ నిర్మాణ సంస్థ సీఈఓ, నిర్మాత రాజశేఖర్ పాండ్యన్ కుమార్తె ఆంత్రా రాజశేఖర్ అంతర్జాతీయ షూటింగ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కజకిస్థాన్లో జరిగిన 16వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో ఏకంగా రెండు పతకాలు సాధించి దేశం గర్వపడేలా చేసింది. ఈ పోటీల్లో ఆమె ఒక స్వర్ణం, ఒక కాంస్యం గెలుచుకుంది.కజకిస్థాన్లోని షిమ్కెంట్ నగరంలో జరిగిన ఈ టోర్నమెంట్లో ఆంత్రా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ‘ట్రాప్ ఉమెన్ యూత్’ వ్యక్తిగత విభాగంలో పోటీపడిన ఆమె కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. విశేషమేమిటంటే, ఇదే విభాగంలో స్వర్ణం, రజతం కూడా భారత క్రీడాకారిణులకే దక్కాయి. తనిష్కా సెంథిల్ కుమార్ స్వర్ణం గెలవగా, నీలా రాజా బాలు రజత పతకం సాధించారు. ఈ ముగ్గురూ తమిళనాడుకు చెందిన వారు కావడం గమనార్హం.ఇక టీమ్ ఈవెంట్లోనూ భారత అమ్మాయిలు సత్తా చాటారు. ఆంత్రా, తనిష్కా, నీలా కలిసికట్టుగా పోటీపడి ‘ట్రాప్ ఉమెన్ యూత్ టీమ్’ విభాగంలో భారత్కు స్వర్ణ పతకాన్ని అందించారు. ఈ విజయంపై ఆంత్రా తండ్రి రాజశేఖర్ పాండ్యన్ ఆనందం వ్యక్తం చేశారు. ఆరు దేశాల నుంచి వచ్చిన షూటర్లతో గట్టి పోటీని ఎదుర్కొని తమ కుమార్తె పతకాలు సాధించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా రాజశేఖర్ పాండ్యన్ మాట్లాడుతూ, "నా కుమార్తెలలో ఒకరైనా నా ఇష్టమైన షూటింగ్ను కెరీర్గా ఎంచుకోవాలన్నది నా కల. కేవలం 17 ఏళ్ల ఆంత్రా నా కలను నిజం చేసింది. 12 ఏళ్ల వయసు నుంచే ఆమె షూటింగ్లో శిక్షణ తీసుకుంటోంది. భవిష్యత్తులోనూ ఇదే క్రీడలో కొనసాగాలని నిర్ణయించుకుంది" అని తెలిపారు. రాబోయే జాతీయ ఛాంపియన్షిప్తో పాటు, ఇతర పోటీలకు ఆంత్రా సిద్ధమవుతోందని, 2028లో లాస్ ఏంజిల్స్లో జరిగే ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa