ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు తీపికబురు చెప్పింది. విశాఖపట్నం కేజీహెచ్ (కింగ్జార్జ్ ఆసుపత్రి)లో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్ పని పట్టేలా రేడియో థెరపీ విభాగంలో అత్యాధునిక వైద్య పరికరాలతో సేవలు ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందిస్తున్న ఈ క్యాన్సర్ సేవల కోసం రూ.వేలల్లో, లక్షల్లో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. ఇకపై కేజీహెచ్లో ఉచితంగా అందిస్తారు. ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం కేజీహెచ్కు రూ.40 కోట్ల విలువ చేసే మూడు కీలక వైద్య పరికరాలను అందించింది. కేజీహెచ్కు వచ్చే రోగులతో పాటుగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద వచ్చే రోగులకు వైద్యం అందిస్తారు.
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుండి వచ్చే రోగులకు కేజీహెచ్లో అన్ని రకాల రేడియో థెరపీ సేవలను అందించొచ్చు. కొత్త పరికరాలతో క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని తాము సిద్ధంగా ఉన్నామని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారిణి డాక్టర్ వాణి తెలిపారు. కొత్త పరికరాలు అందుబాటులోకి రావడంతో, శరీరంలో ఏ భాగానికి క్యాన్సర్ వచ్చినా నయం చేయవచ్చు అంటున్నారు. ప్రస్తుతం టెలీ కోబాల్డ్ యంత్రంతో రేడియేషన్ చికిత్స చేస్తున్నారని.. దాని స్థానంలో కొత్త యంత్రాలు వచ్చాయన్నారు. అంతేకాదు రేడియో థెరపీ విభాగంలో చికిత్సతో పాటు పీజీ కోర్సులు కూడా బోధిస్తారు. ఈ విభాగంలో ప్రస్తుతం ఏడుగురు పీజీ విద్యార్థులు ఉన్నారు. అలాగే ఒక ప్రొఫెసర్, ఒక సహ ప్రొఫెసర్, ఇద్దరు సహాయ ప్రొఫెసర్లు ఉన్నారు.
బ్రాకో థెరపీ యూనిట్ ద్వారా ఐసీఆర్, ఐఎల్ఆర్టీ, ఐఎస్బీటీ, మెల్డ్ థెరపీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలు ఇంట్రా కేవిటీ రేడియేషన్, ఇంట్రా లూమినల్ రేడియో థెరపీ, ఇంటర్ స్టీటియల్ బ్రాచి థెరపీ వంటి చికిత్సలను అందిస్తాయి. లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. 3డీ సీఆర్టీ, ఐఎంఆర్టీ, ఐజీఆర్టీ వంటి రేడియోథెరపీ విధానాలతో పాటు, మెదడు కణితులకు ఎస్ఆర్ఎస్, ఎస్బీఆర్టీ చికిత్సలు కూడా చేయనున్నారు. అలాగే సీటీ స్టిమ్యులేటర్ ద్వారా.. క్యాన్సర్ బారినపడిన వారికి అవసరమైన స్కానింగ్ పరీక్షలు చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa