ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం సీఆర్డీఏ ఇప్పటికే 50 ఎకరాల స్థలం కూడా కేటాయించింది. ప్రభుత్వ సంస్థగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (AQCC) ఏర్పాటు కానుంది. తాజాగా ఏక్యూసీసీలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చదరపు అడుగుకు రూ.30లు అద్దె చెల్లించేలా ఏపీ ప్రభుత్వం రాయితీపై ఐబీఎం సంస్థకు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా ఐబీఎం సంస్థ 4 ఏళ్ల పాటు ఏడాదికి 365 గంటల ఫ్రీ కంప్యూటింగ్ టైమ్ను ప్రభుత్వానికి కేటాయించనుంది.
ఈ కంప్యూటింగ్ టైమ్ను ప్రభుత్వ సంస్థలు, విద్యాపరమైన అంశాలకు కేటాయిస్తారు. ఈ మేరకు ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్.. తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు అమరావతి క్వాంటం వ్యాలీ లో 2000 చదరపు అడుగుల్లో.. 133 క్యూబిట్, 5కె గేట్స్ క్యాంటం కంప్యూటర్ను ఐబీఎం సంస్థ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్లో వివిధ శాఖల అధికారులను బోర్డు డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. అమరావతిని టెక్నాలజీ హబ్గా మార్చా్లనే ఉద్దేశంతో అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయనున్నారు.
రూ.4,000 కోట్లతో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. 2026 జనవరి నాటికి క్వాంటం వ్యాలీ కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. దీని ద్వారా 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతీయ క్వాంటం మిషన్లో భాగంగా అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు ప్రభుత్వానికి సహకారం అందించనున్నాయి. ఎల్అండ్టీ సంస్థ మౌలిక సదుపాయాలు కల్పిస్తే.. హైబ్రిడ్ కంప్యూటింగ్ సొల్యూషన్లు, క్యాంటం కంప్యూటింగ్ సేవలను టీసీఎస్ అందిస్తుంది. ఐబీఎం సంస్థ దేశంలోనే అత్యంత వేగవంతమైన క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుచేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa