కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఓట్ల చోరీకి పాల్పడిందంటూ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు తెరతీసిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు ఓట్ల చోరీని ప్రధాన అస్త్రంగా చేసుకుని.. కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బిహార్లో ఓటర్ అధికార్ ర్యాలీని రాహుల్ గాంధీ నిర్వహించారు. త్వరలోనే అణుబాంబు పేలుస్తానని ప్రకటించిన రాహుల్ గాంధీ ఇప్పటికే ఓట్ల చోరీకి సంబంధించి కొన్ని ఆధారాలు చూపించారు. అయితే వాటిని కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం ఖండించాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరో సంచలన హెచ్చరికలు చేశారు. త్వరలోనే హైడ్రోజన్ బాంబ్ వేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ.. ఓటర్లను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని.. ఆరోపించారు. త్వరలోనే ఓట్ల చోరిపై తాను హైడ్రోజన్ బాంబు పేలుస్తానని తాజాగా పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ద్వారా బిహార్లో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారని ఇప్పటికే అధికార బీజేపీతోపాటు ఎన్నికల సంఘంపైనా ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క బిహార్ రాష్ట్రంలోనే 65 లక్షల మంది ఓటర్లను అక్రమంగా తొలగించారంటూ రాహుల్ గాంధీ గత కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు.
బిహార్లో చేపట్టిన ఓటర్ అధికార్ ర్యాలీ ముగింపు సందర్భంగా బీజేపీని ఉద్దేశించి రాహుల్ గాంధీ తీవ్రంగా హెచ్చరించారు. రాజ్యాంగాన్ని హత్య చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తాము సాగనివ్వమమని.. అందుకే ఓటర్ అధికార్ యాత్రను చేపట్టినట్లు తెలిపారు. ప్రజల నుంచి ‘ఓట్ చోర్, గద్ది చోర్’ అనే నినాదాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఓట్ చోర్ అనే నినాదం ప్రతీ చోటా వినిపిస్తోందని.. ఇది ఇప్పుడు చైనాకు కూడా చేరుకుందని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా ఎస్సీఓ పర్యటనను ఉద్దేశించి రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. అణు బాంబు కన్నా పెద్దది ఏదైనా విన్నారా.. అదే హైడ్రోజన్ బాంబు అని.. బీజేపీకి చెప్పారు. హైడ్రోజన్ బాంబు వస్తోందని.. దానికి బీజేపీ సిద్ధంగా ఉండాలని రాహుల్ గాంధీ అన్నారు.
ఇక రాహుల్ గాంధీ చేసిన హైడ్రోజన్ బాంబ్ వ్యాఖ్యలపై బీజేపీ అదే స్థాయిలో విరుచుకుపడింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తనను తాను కించపరుచుకోవడంతోపాటు.. దేశంలోని ఓటర్లను అవమానించడమేనని బీజేపీ మండిపడింది. బిహార్లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ ర్యాలీకి ఉత్తర్ప్రదేశ్లోని డియోరియా నుంచి 20 వేల మందిని తీసుకువచ్చారని బీజేపీ ఆరోపించింది. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు విన్నప్పుడల్లా.. పార్లమెంటు లోపల అయినా బయట అయినా.. ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి తనకు సమయం పడుతుందని.. బీజేపీ నేత, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. అణు బాంబు, హైడ్రోజన్ బాంబులకు.. ఎన్నికలతో ఏం సంబంధమని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని రవి శంకర్ ప్రసాద్ మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa