ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ20 పెట్రోల్‌ వినియోగంకు లైన్ క్లియర్.. సురక్షితం కాదంటూ వేసిన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Mon, Sep 01, 2025, 07:53 PM

గత కొన్నిరోజులుగా E20 పెట్రోల్‌ (ఇథనాల్ కలిపిన పెట్రోల్)పై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్యూర్ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి వాహనాల్లో ఉపయోగించడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా.. పర్యావరణానికి హాని తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే E20 పెట్రోల్‌ వాడటం వల్ల వాహనాల్లో సమస్యలు వస్తున్నాయని వాహనదారులు, మెకానిక్‌లతోపాటు, పలువురు నిపుణులు కూడా గత కొన్నిరోజులుగా మీడియా, సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో E20 పెట్రోల్‌ వినియోగంపై వాహనదారుల్లో సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలోనే E20 పెట్రోల్‌ వినియోగంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.


వాహనాల్లో E20 పెట్రోల్‌ ఉపయోగించడాన్ని లాయర్ అక్షయ్ మల్హోత్రా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్ట్.. దాన్ని కొట్టేసింది. మన దేశంలోకి ముడి చమురు దిగుమతులను తగ్గించడం, వాహన ఉద్గారాలను కంట్రోల్ చేయడం, ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ E20 పెట్రోల్‌ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే E20 పెట్రోల్‌పై వస్తు్న్న ఫిర్యాదులు, ఆరోపణలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఖండించిందని గుర్తు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో E20 పెట్రోల్‌ వినియోగంపై కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు కీలక ముందడుగు పడినట్లయింది.


E20 పెట్రోల్‌ వాహనాలకు సేఫ్ కాదంటూ కొన్ని కథనాలు వచ్చాయి. ఇది పాత వాహనాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని.. డ్రైవింగ్‌ను దెబ్బతీస్తుందని చాలా మంది వాహనదారులు బహిరంగంగానే తీవ్ర అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కేంద్ర సహజవాయువు మంత్రిత్వశాఖ ఇటీవల ఒక క్లారిటీ ఇచ్చింది. E20 పెట్రోల్‌పై వస్తున్న పుకార్లు, ఆరోపణలు.. ఆధారాలు లేకుండా చేస్తున్నారని స్పష్టం చేసింది. నిపుణుల విశ్లేషణకు, శాస్త్రీయ ఆధారాలకు ఈ ఆరోపణలను అనుగుణంగా లేవని తెలిపింది. ఈ సమయంలోనే ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ వినియోగించడం వల్ల వాహనాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తవని తేల్చి చెప్పింది.


ఇక ఇథనాల్‌ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని కేంద్రం తెలిపింది. పెట్రోల్‌ కంటే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుందని.. దానివల్ల మైలేజీ తగ్గినప్పటికీ.. అది చాలా తక్కువగానే ఉంటుందని స్పష్టం చేసింది. లక్ష కిలోమీటర్ల మేర సాధారణ పెట్రోల్, E20 పెట్రోల్ నింపి.. వాహనాలను టెస్ట్ చేయగా.. వాటి పవర్‌, టార్క్‌, ఇంధన సామర్థ్యంలో భారీ తేడాలు ఏమీ కనిపించలేదని తేల్చి చెప్పింది.


కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినప్పటికీ.. నిపుణులు మాత్రం ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తునే ఉన్నారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలిపి వాడటం వల్ల ఇంధన సామర్థ్యం 2 నుంచి 5 శాతం తగ్గిపోవచ్చని అంచనా వేశారు. అయితే రకరకాల కార్లలో కొన్ని తేడాలు ఉండొచ్చని చెబుతున్నారు. ఇక E20 పెట్రోల్ వినియోగం వల్ల పాత వాహనాల్లో ఇప్పటికిప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ చూపించకపోయినా.. భవిష్యత్తులో గ్యాస్కెట్లు, పెట్రోల్ పైపులు దెబ్బతింటాయని పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa