ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లైన మూడేళ్లకే,,,వరకట్న దాహానికి మరో మహిళ బలి

national |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 08:23 PM

నేటి రాకెట్ యుగంలో కూడా వరకట్న వేధింపుల కేసులు పెరగడం సంచలనంగా మారింది. ఈమధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో భార్య గర్భవతి అని కూడా చూడకుండా వారిపై దాడి చేసి పైశాచికంగా హతమారుస్తున్నారు. ఈమధ్య కాలంలో నోయిడా, బెంగళూరులో ఇలాంటి ఘటనలు కొన్ని వెలుగు చూశాయి. వీటిని మరిచిపోకముందే.. మరో చోట వరకట్నం దాహానికి మరో మహిళ అన్యాయంగా బలైంది. వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇది కూడా బెంగళూరులోనే వెలుగు చూడటం గమనార్హం. ఆ వివరాలు..


కర్ణాటక , బెంగళూరుకు చెందిన ఓ మహిళ వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి.. మరణించిన మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బెంగళూరుకు చెందిన పూజశ్రీ అనే 28 ఏళ్ల మహిళ బ్యాంకులో ఉద్యోగం చేస్తుండేది. మూడేళ్ల క్రితం ఆమెకు సందీప్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి కాపురం బాగానే సాగింది. వీరికి ఒక కుమార్తె సంతానం కూడా ఉంది.


కొన్నాళ్ల పాటు బాగానే సాగిన వీరి కాపురంలో కొన్ని రోజుల నుంచి కలతలు మొదలయ్యాయి. సందీప్ అదనపు కట్నం తేవాలంటూ పూజశ్రీని వేధించసాగాడు. అయితే అతడికి మరో మహిళతో వివాహేతర బంధం ఉందని.. దాని గురించి పూజశ్రీకి తెలిసిన తర్వాతే.. అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయని పూజశ్రీ కుటుంబీకులు చెప్పుకొచ్చారు. అదనపు కట్నం తేవాలంటూ సందీప్ రోజు పూజశ్రీతో గొడవపడేవాడని వారు చెప్పుకొచ్చారు.


భర్త వేధింపులు భరింలేకపోయిన పూజశ్రీ పుట్టింటికి వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత తల్లిదండ్రులు పూజశ్రీకి సర్దిచెప్పి.. మళ్లీ అత్తింటికి పంపించారు. ఒకసారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఇక మీదట భార్యను ఇబ్బంది పెట్టనని హామీ ఇచ్చి ఇంటికి తీసుకు వచ్చాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. మళ్లీ వేధింపులు ప్రారంభించాడు. చనిపోవడానికి ముందు రోజు కూడా పూజశ్రీ.. సందీప్ వేధింపులు భరింలేక పుట్టింటికి వెళ్లింది.


దీంతో సందీప్ ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అత్తింటికి వెళ్లి భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. అదే రోజు ఉదయం 8 గంటల తర్వాత పూజశ్రీ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ సందర్భంగా పూజశ్రీ తల్లిదండ్రులు మాట్లాడుతూ 30 లక్షల రూపాయలు అప్పు చేసి మరీ మా బిడ్డకు పెళ్లి చేశాం. అతడికి పెళ్లికి ముందే మరో మహిళతో సంబంధం ఉంది. మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాక.. ఇల్లు కావాలని డిమాండ్ చేశాడు. ఆరోజు కూడా పూజశ్రీని మా ఇంటి నుంచి తీసుకుని వెళ్లిన కాసేపటికే తను చనిపోయిందని చెప్పాడు. మా బిడ్డను అతడే చంపాడు అని కన్నీరు పెట్టుకున్నారు.బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు బగలగుంటె పోలీసులు వరకట్న వేధింపుల ఆరోపణల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa