ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూమ్మీద ఎక్కడున్నా సరే, లక్ష్యాన్ని ఛేదించే భారీ న్యూక్లియర్ మిసైల్

international |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 08:50 PM

 పొరుగు దేశం చైనా .. తన ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు భారీగా పెంచుకుంటూనే ఉంది. చుట్టు పక్కల ఉన్న దేశాలతో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్న డ్రాగన్.. తన సైనిక, ఆయుధ శక్తిని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థులను భయపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల షాంఘై కో ఆపరేషన్ సమ్మిట్ (ఎస్‌సీఓ సదస్సు) ముగిసిన తర్వాత.. చైనా సైనిక, ఆయుధ పరేడ్‌ను నిర్వహించింది. ఈ పరేడ్‌లో తన వద్ద ఉన్న ఆయుధాలను ప్రపంచ దేశాలకు చూపించింది. ఇందులో అత్యాధునిక మిసైళ్లు, ఇతర రక్షణ వ్యవస్థలను ప్రదర్శించింది. ఇక భారీ న్యూక్లియర్ మిసైల్ అయిన డీఎఫ్‌-5సీని ప్రపంచం ముందు పెట్టింది. దీన్ని ఒకేసారి తరలించడం వీలు కాదని.. దాన్ని 3 ముక్కలు చేసి తరలించి.. ఆ తర్వాత బిగించి.. ప్రయోగించవచ్చని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అంటే అంతటి భారీ అణు క్షిపణి అని అర్థం అవుతోంది.


తాజాగా విక్టరీ డే మిలిటరీ పరేడ్‌ నిర్వహించిన చైనా.. తన అమ్ముల పొదిలో ఉన్న అత్యాధునిక భారీ న్యూక్లియర్ మిసైల్‌ను ప్రపంచం ముందు ఉంచింది. దీని పేరు డీఎఫ్‌-5సీ అని చైనా మీడియా సంస్థ అయిన గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఈ అత్యాధునిక క్షిపణి.. భూమి మొత్తంలో ఎక్కడైనా ప్రయోగించగల సామర్థ్యం కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంటే ఈ డీఎఫ్-5సీ న్యూక్లియర్ మిసైల్‌ను అక్కడే ఉంచి.. ప్రపంచంలో ఏ మూలన ఉన్న లక్ష్యాన్నైనా ధ్వంసం చేసే కెపాసిటీ దాని సొంతం. అంతేకాకుండా అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను ఛేదించుకుని మరీ.. లక్ష్యంపై దాడి చేయగలదని నిపుణులు పేర్కొంటున్నారు.


అయితే ఈ డీఎఫ్-5సీ అణు క్షిపణిని.. ఒకే వాహనంపై మోసుకెళ్లడం సాధ్యం కాదని తెలుస్తోంది. దాన్ని 3 భాగాలుగా విభజించి.. ఒకచోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లి.. అనంతరం అసెంబ్లింగ్‌ చేసి ప్రయోగించనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటివరకు చైనా వద్ద ఉన్న డీఎఫ్‌-5 కంటే.. డీఎఫ్‌-5సీని మరింత వేగంగా ప్రయోగించేందుకు అవకాశం ఉంటుందని న్యూక్లియర్ ఎక్స్‌పర్ట్ ప్రొఫెసర్‌ యాంగ్‌ చెంగ్జిన్‌ పేర్కొన్నారు. ఇక ఈ డీఎఫ్-5సీని భారీ బొరియల్లో నుంచి కూడా ప్రయోగించవచ్చని వెల్లడించారు.


ఇక ఈ అణు మిసైల్‌ రేంజ్ 20 వేల కిలోమీటర్లకు పైనే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే భూమి మొత్తం ప్రయాణించగలదని పేర్కొన్నారు. ఈ మిసైల్ ప్రయోగించారంటే.. శత్రువు ఎక్కడా దాక్కునే అవకాశమే లేదని.. శత్రుదేశంలోని భూగర్భ స్థావరాలను కూడా ఇది ఛేదించగలదని చెబుతున్నారు. ఇక డీఎఫ్‌-5సీ మిసైల్‌ను ప్రయోగించే తీరు కూడా వేరుగా ఉంటుందని యాంగ్‌ చెంగ్జిన్ వెల్లడించారు. ఈ డీఎఫ్‌-5సీ భారీ అణు ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించినపుడు.. ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణం చేస్తుందని పేర్కొన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్‌లను.. అతి తక్కువ సమయంలోనే శత్రు స్థావరాలపై దాడి చేస్తుందని చెబుతున్నారు.


ఈ డీఎఫ్‌-5సీలో ఎంఐఆర్‌వీ (మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌లీ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్స్‌)ను వినియోగించారు. అంటే ఒకే సమయంలో శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థలను పక్కదారి పట్టించే డెకాయ్‌లను ప్రయోగించగలదు. అంతేకాకుండా ఒకేసారి.. వేర్వేరు లక్ష్యాలపై దాడి చేసేలా ఏకకాలంలో 10 వార్‌ హెడ్‌లను మోసుకెళ్లగలదని పేర్కొంటున్నారు. సాధారణ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులకు అత్యంత కచ్చితత్వం దాడి చేసే సామర్థ్యం ఉండదు. కానీ ఈ డీఎఫ్-5సీలో చైనా డెవలప్ చేసిన బైడూ నేవిగేషన్‌ సిస్టమ్‌ సహా మరిన్ని అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించారు.


ఈ డీఎఫ్-5సీ న్యూక్లియర్ మిసైల్ మాత్రమే కాకుండా చైనా.. తొలిసారి మరిన్ని ఆయుధాలను ఈ విక్టరీ డే పరేడ్‌లో ప్రదర్శించింది. ఎల్‌వై-1 లేజర్‌ సిస్టమ్‌ను ఒక టక్కుపై తీసుకొచ్చారు. వీటితోపాటు హైపవర్డ్‌ మైక్రోవేవ్‌ సిస్టమ్‌లను కూడా తెలిపింది. అంతేకాకుండా న్యూజనరేషన్‌ టైప్‌-100 ట్యాంక్‌లు పరేడ్‌లో కనిపించాయి. మరోవైపు.. 12 వేల కిలోమీటర్ల రేంజ్ ఉన్న డాంగ్‌ఫెంగ్‌-61 ఇంటర్ కాంటినెంటల్ మిసైల్‌ను చూపించింది. ఇక గాల్లో నుంచే ప్రయోగించే జేఎల్‌-1 న్యూక్లియర్ వెపన్‌ను తొలిసారిగా ప్రపంచం ముందుకు తీసుకువచ్చింది.


వీటితోపాటు ఏజేఎక్స్‌ 002 అనే భారీ సముద్ర డ్రోన్‌ కూడా పరేడ్‌లో ఆకర్షణగా నిలిచింది. చైనా సముద్ర జలాల్లో లోతుల్లోకి దూసుకొచ్చే శత్రుదేశాల ముప్పును ఎదుర్కొనేందుకు ఈ ఏజేఎక్స్‌ 002ను రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో దాడిచేసే డ్రోన్లు కూడా విక్టరీ డే పరేడ్‌ ప్రదర్శనలో కనిపించాయి. చైనా సైన్యానికి చెందిన రాకెట్‌ ఫోర్స్‌ తయారు చేసిన డీఎఫ్‌-26డీ మధ్యశ్రేణి రేంజ్ బాలిస్టిక్‌ క్షిపణిని తొలిసారి బయటికి తీసుకువచ్చారు. ఇవే కాకుండా సీజే-1000 హైపర్‌ సోనిక్‌ మిసైల్, జీజే-11 లాయల్‌ వింగ్‌మన్‌, హైచ్‌క్యూ-29 యాంటీ బాలిస్టిక్‌ మిసైల్‌ సిస్టమ్‌, హెచ్‌క్యూ-20 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్, హెచ్‌క్యూ-11 ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్‌, చైనా హమార్స్‌గా పేరున్న పీహెచ్‌ఎల్‌-16 వంటి ఆయుధాలను విక్టరీ డే పరేడ్‌లో చైనా ప్రపంచానికి పరిచయం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa