దివ్యాంగులకు ప్రభుత్వం జారీ చేసే సదరం సర్టిఫికెట్ ఇప్పుడు ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి.. టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. దాదాపు 15 నెలలు అవుతోంది. అయినప్పటికీ కొందరు క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం.. తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ముఖ్యమంత్రి, అధికార పార్టీ మారి.. 15 నెలలు గడుస్తున్నా.. అధికారులు జారీ చేసే పత్రాలపై మాజీ సీఎం, గత ప్రభుత్వానికి సంబంధించిన గుర్తులు, చిహ్నాలు, ఫోటోలు ఉండటం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఇక ఇటీవల ఓ దివ్యాంగురాలికి జారీ చేసిన సదరం సర్టిఫికెట్పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గత ప్రభుత్వం ఇచ్చిన నవరత్నాలు పథకాలకు సంబంధించిన లోగో ఉండటం.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
గుంటూరు జిల్లాలోని బ్రాడీపేటకు చెందిన ఓ దివ్యాంగురాలు .. తనకు సదరం సర్టిఫికెట్ కావాలని అధికారులకు కొన్ని నెలల క్రితం దరఖాస్తు పెట్టుకుంది. 127వ వార్డు సచివాలయం పరిధిలో ఉండే ఓ దివ్యాంగురాలికి ఈ ఏడాది ఫిబ్రవరి నెల 20వ తేదీన గుంటూరు జీజీహెచ్లో మెడికల్ టెస్ట్లు చేసి.. 100 శాతం వైకల్యం ఉందని డాక్టర్లు ధృవీకరించి సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే 127వ వార్డు సచివాలయ సిబ్బంది.. అప్పటి నుంచి ఆమెకు సదరం సర్టిఫికెట్ జారీ చేయడంలో తీవ్ర జాప్యం చేశారు. ఎట్టకేలకు ఇటీవల మంగళవారం (సెప్టెంబర్ 2వ తేదీ)న సంక్షేమ శాఖ కార్యదర్శి రవికుమార్.. ఆ దివ్యాంగురాలి కుటుంబానికి సదరం సర్టిఫికెట్ అందించారు.
అయితే ఆ సదరం సర్టిఫికెట్ చూసి.. ఆమె కుటుంబం షాక్కు గురైంది. ఎందుకంటే దానిపై మాజీ సీఎం జగన్, నవరత్నాల లోగో ఉండటం చూసి అవాక్కయ్యారు. దీనిపై అభ్యంతరం తెలిపి ప్రశ్నించగా.. సంక్షేమ కార్యదర్శి రవికుమార్ సరైన రీతిలో స్పందించలేదు. పైగా.. జగన్ ఫొటో ఉంటే సర్టిఫికెట్ చెల్లదా అంటూ ఆ దివ్యాంగురాలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఫోటో ఉన్న సర్టిఫికెట్ను మార్చేసి.. కొత్తది ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా.. సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందించారు. ఇక ఈ విషయం కాస్తా.. గుంటూరు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు వద్దకు చేరింది.
దీంతో 127వ వార్డు సచివాలయం సిబ్బందిని పిలిపించిన జీఎంసీ కమిషనర్.. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యా డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ ఆర్.రామబిల్వికాదేవి, వార్డు సంక్షేమ సెక్రెరటరీ వి.రవికుమార్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో నోడల్ అధికారి, ఏఈ కె.సాంబశివరావు, పరిపాలన కార్యదర్శి ఎ.నాగమణిలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంపై స్పందించిన జీఎంసీ ఉన్నతాధికారులు.. గత ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలు గానీ, ఫొటోలు గానీ, బ్యానర్లు, స్టేషనరీ ఉంటే అప్పగించాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa