తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచన ఇచ్చింది. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం జరగబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని కొన్ని గంటలపాటు మూసివేయనున్నట్లు వెల్లడించింది.చంద్రగ్రహణం ఆదివారం రాత్రి 9.50 గంటలకు ప్రారంభమై, సోమవారం తెల్లవారుజామున 1.31 గంటలకు ముగియనుంది. ఆచారానుసారం, గ్రహణానికి 6 గంటల ముందే ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా ఉండటంతో, సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3.30 గంటల నుంచి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 3 గంటల వరకు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మూసివేయబడుతుంది.తదుపరి ఉదయం 3 గంటలకు ఆలయ తలుపులు తెరిచి, శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఆ తరువాత తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా చేసి, ఉదయం 6 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.అలాగే, చంద్రగ్రహణం కారణంగా ఆదివారం ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా జరిగే గరుడ సేవ కూడా రద్దు చేయబడింది.ఇక, ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు అన్నప్రసాదాల వితరణ నిలిపివేయబడుతుందని, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరింది. ఈ సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వీ ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2, పీఏసీ -2లో అన్నప్రసాదాలు అందుబాటులో ఉండవు.భక్తుల సౌకర్యార్థం, ముందస్తుగా 30 వేల పులిహోర ప్యాకెట్లు ఆదివారం సాయంత్రం 4.30 గంటల నుంచి వైభవోత్సవ మండపం, రామ్ భగీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంటర్లు, శ్రీవారి సేవా సదన్ వద్ద పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.చంద్రగ్రహణం కారణంగా తిరుమలతో పాటు, తిరుపతిలోని స్థానిక ఆలయాలు కూడా తాత్కాలికంగా మూసివేయబడతాయి. వీటిలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa