ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రగ్రహణంతో మూతపడిన తిరుమల దేవస్థానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 07, 2025, 05:41 PM

చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3.30 నుంచి సోమవారం వేకువజాము 3 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం మొదలై సోమవారం వేకువజామున 1.31 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణానికి 6 గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ. సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం మొదలవుతుంది. అయితే శనివారం సాయంత్రానికే సర్వదర్శన క్యూలైన్‌ బాటగంగమ్మ ఆలయం వరకు వ్యాపించింది. ఈ క్రమంలో వీరందరికీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలలోపు దర్శనం పూర్తిచేయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఆదివారం నాటి ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటు పౌర్ణమి గరుడసేవను కూడా టీటీడీ రద్దు చేసింది. మరోవైపు గ్రహణం కారణంగా అన్నప్రసాద కేంద్రాన్ని ఆదివారం సాయంత్రం 3 గంటలకే మూసివేస్తారు. తిరిగి సోమవారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో తిరుమలలోని పలు ప్రదేశాల్లో దాదాపు 30 వేల అన్నప్రసాద ప్యాకెట్లను అందించేలా ప్రణాళికలు రూపొందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa