జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హ్యుందయ్- ఎల్జీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ప్లాంట్పై అమెరికా అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి, 475 మంది దక్షిణ కొరియా పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్టు అనుమానిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలస నిరోధక చర్యలో భాగంగా ఇప్పటివరకు చేపట్టిన అతిపెద్ద సింగిల్ సైట్ ఆపరేషన్ ఇదేనని అధికారులు తెలిపారు. ట్రంప్ ప్రతీకార సుంకాలతో అమెరికా, దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 350 బిలియన్ డాలర్లు పెట్టుబడులను కలిగి ఉన్న వాణిజ్య ఒప్పందం వివరాల వెల్లడి విషయంలో రెండు దేశాలు విభేదిస్తున్నాయి.
అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ శనివారం విడుదల చేసిన వీడియోలో.. జార్జియాలోని ఎల్లాబెల్ పట్టణంలోని హ్యుందయ్ మోటార్-ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్ జాయింట్ వెంచర్ ప్లాంట్కు వాహనాల్లో చేరుకున్న ఫెడరల్ ఏజెంట్లు, అక్కడ పనిచేస్తోన్న కార్మికులను బయటకు వచ్చి నిలబడాలని సూచించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఎలక్ట్రికల్ వాహనాలకు బ్యాటరీలు తయారుచేసేందుకు ఈ ప్లాంట్ నిర్మిస్తున్నారు. జార్జియాలోనే అతిపెద్ద ఎకనమిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇదేనంటూ ఆ రాష్ట్ర అధికారులు గతంలో పేర్కొవడం గమనార్మం. అమెరికాలో అక్రమ వలసలపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోల్లో సైట్లో పనిచేస్తోన్న కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన అధికారులు.. ‘సైట్ మొత్తం తనిఖీలు చేయడానికి మాకు సెర్చ్ వారెంట్ ఉంది.. తక్షణమే ఈ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలి.. ప్లాంట్లో పనులు తక్షణమే ముగించాలి’అని చెబుతున్నారు. కొంతమందిని చేతులు పైకెత్తి నిలబడాలని ఆదేశించి.. ఆపై వారి చేతులు, కాళ్లకు సంకెళ్లు వేశారు. మరికొందరికి బస్సు ఎక్కేటప్పుడు చేతికి ప్లాస్టిక్ తాళ్లను కట్టారు.
ఓ కార్మికుడు సీఎన్ఎన్తో మాట్లాడుతూ... ఫెడరల్ ఏజెంట్లు యుద్ధ భూమికి వచ్చినట్టు సైట్ వద్దకు చేరుకున్నారని అన్నారు. ‘‘మమ్మల్నిందరినీ గోడపైకి ఎక్కమని చెప్పారు... మేము దాదాపు గంటసేపు అక్కడే నిల్చోబెట్టి ఆపై మరొక చోటుకు తీసుకెళ్లారు.. ఆ తర్వాత ఇంకో భవనం లోపలికి తరలించారు’’ అని అతను వివరించాడు.
అంతేకాదు, ‘మా గుర్తింపు తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరి సోషల్ సెక్యూరిటీ నెంబరు, పుట్టిన తేదీ, ఇతర సమాచారం గురించి అడిగారు. చట్టబద్దంగా వచ్చినవారైతే వారికి డిపార్ట్మెంట్ క్లియరెన్స్ పత్రం ఇచ్చి, గేటు బయట ఉన్న అధికారులకు చూపించిన తర్వాత అక్కడ నుంచి వెల్లిపోవాలని సూచించారు’ ఓ ఉద్యోగి అన్నారు.
సోదాలు వార్త తెలియగానే, ఓ కార్మికుడు ఫెడరల్ ఏజెంట్ల నుంచి తప్పించుకోవడానికి ఒక ఎయిర్ డక్ట్లో దాక్కున్నాడు. ‘కొందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇమ్మిగ్రేషన్ అధికారులు వచ్చారని మాకు చెప్పారు. మేము ఎయిర్ డక్ట్లో దాక్కున్నాం... అందులో చాలా వేడిగా ఉంది’ అని తెలిపాడు.
ఆసియాలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన దక్షిణ కొరియా.. అమెరికాలో అనేక ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ ప్లాంట్లు నడుపుతోంది. కర్మాగారాలు నిర్మాణం ద్వారా అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడానికి, ట్రంప్ సుంకాల బెదిరింపులను తప్పించుకోడానికి దక్షిణ కొరియా కంపెనీలు అమెరికాలో బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టాయి. అయితే, ప్లాంట్ నిర్మాణంలో పనిచేసే కార్మికులు అక్రమంగా అమెరికాకు వచ్చినట్టు అట్లాంటాలోని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఏజెంట్ స్టీవెన్ ష్క్రాంక్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa