జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. తన సొంత జిల్లా కలబురిగిలో ఒక రైతుతో వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. పంట నష్టం గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక రైతుపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ రైతును నిర్లక్ష్యంగా తిరిగి పంపించేయడం ప్రస్తుతం ప్రజల ఆగ్రహానికి కారణం అవుతోంది. ముఖ్యంగా వర్షాలు ఎక్కువై పంట నష్టపోయానని ఆవేదనతో వచ్చిన రైతుకు.. ఖర్గే ఇచ్చిన సమాధానం రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. మరి ఖర్గే అంతలా ఏం కామెంట్లు చేశారంటే..?
ఈ ఘటన కలబురిగిలో జరిగింది. తమ కళ్ల ముందే పంటలు నాశనం అయిపోతున్నాయని, వర్షాలు ఎక్కువై పంటంతా వర్షార్పణం అయిందని చెప్పడానికి ఆ రైతు నేరుగా ఖర్గే వద్దకు వచ్చాడు. రైతు కష్టాన్ని విన్న తర్వాత ఖర్గే ఆప్యాయంగా స్పందించడానికి బదులుగా.. “నేనేం చేయాలి? వెళ్లి మోదీని అడగండి” అని మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా నీది నాలుగు ఎకరాలు మాత్రమే పాడైంది. నాదైతే 40 ఎకరాలు నాశనం అయిందంటూ చెప్పుకొచ్చాడు. మరి నేనేం చేయాలంటూ రైతును ప్రశ్నించారు. ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలకు ఆ రైతు ఆశ్చర్యపోయి.. “మీరు మా నాయకుడు కాబట్టే మీ వద్దకు వచ్చాను” అని బదులిచ్చాడు.
కానీ ఖర్గే ఆ రైతు మాటలను పట్టించుకోకుండా.. “ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్” అంటూ అభివర్ణించారు. ఇలాంటి పనులు మరోసారి చేయొద్దంటూ రైతును అక్కడి నుంచి పంపించివేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. ప్రజలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతు సమస్యలు, పంట నష్టాలు, అన్నదాతలకు జీవన్మరణ సమస్యగా మారిన ప్రస్తుత తరుణంలో.. ఒక సీనియర్ నాయకుడి నుంచి ఇలాంటి స్పందన రావడం సమాజంలో అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. వ్యవసాయ సంక్షోభంపై పదేపదే మాట్లాడే నాయకులు, క్షేత్ర స్థాయిలో రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని ఇది రుజువు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఖర్గే ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా ఖర్గే అందరికీ సుపరిచితులు. ఆయన తన ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి, అండగా నిలుస్తారని కలబురిగి ప్రజలు విశ్వసించారు. కానీ ఈ ఘటన ఆ నమ్మకాన్ని దెబ్బతీసిందనే భావన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఈ సంఘటన రైతులకు నేరుగా అండగా నిలవాల్సిన నాయకులు, వారి సమస్యలను రాజకీయంగా చూస్తున్నారని.. ఇది దేశవ్యాప్తంగా అన్నదాతల ఆవేదనను మరింత పెంచుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa