ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమతా బెనర్జీకి లేఖ వ్రాసిన చిన్నారి బాలుడు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 04:52 PM

"ప్రియమైన మమత దీదూన్ (అమ్మమ్మ).. మా అమ్మను దయచేసి మా ఇంటికి పంపించండి. అమ్మ లేకుండా నాకు చాలా బాధగా ఉంది" అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఐదేళ్ల బాలుడు రాసిన ఓ లేఖ అందరి హృదయాలను కదిలిస్తోంది. తన తల్లిని ఇంటికి దగ్గర్లోని పాఠశాలకు బదిలీ చేయాలని కోరుతూ అసన్‌సోల్‌కు చెందిన ఐతిజ్య దాస్ అనే చిన్నారి ఈ లేఖ రాశాడు.ఐతిజ్య తల్లి స్వాగత పెయిన్ 2021లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. ఆమెకు వారు నివసిస్తున్న అసన్‌సోల్‌కు దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర దినాజ్‌పూర్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె కుటుంబానికి దూరంగా ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వచ్చి వెళ్తున్నారు. దీంతో తల్లిని విడిచి ఉండలేకపోతున్న ఐతిజ్య తన ఆవేదనను అక్షర రూపంలో పెట్టాడు."మా ఇల్లు అసన్‌సోల్‌లో ఉంది. మా అమ్మ ఉత్తర దినాజ్‌పూర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. అందుకే ఆమె మాకు దూరంగా ఉంటోంది. చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తుంది. నేను ఇక్కడ మా నాన్న, తాతయ్యతో కలిసి ఉంటున్నాను. అమ్మ లేకుండా ఉండటం నాకు చాలా విచారంగా ఉంది. నేను అమ్మను చాలా ప్రేమిస్తున్నాను. దయచేసి మా అమ్మను త్వరగా ఇంటికి పంపండి. ఆమె ఇకపై మాకు దూరంగా ఉండకుండా చూడండి" అని ఐతిజ్య తన లేఖలో సీఎంను వేడుకున్నాడు.ఈ విషయంపై బాలుడి తల్లి స్వాగత మాట్లాడుతూ బదిలీ కోసం తాను అనేక కార్యాలయాలకు లేఖలు రాసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. 2021లో నియమితులైన సుమారు 16,500 మంది ప్రాథమిక ఉపాధ్యాయులు తమ ఇళ్లకు దూరంగా పనిచేస్తూ ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు."మమత దీదూన్ నా విజ్ఞప్తిని తప్పకుండా వింటారని నమ్ముతున్నాను. ఆమె నా కోరిక నెరవేరిస్తే నేను ఆమెకు ధన్యవాదాలు చెబుతూ మరో లేఖ రాస్తాను" అని ఐతిజ్య ఎంతో ఆశగా చెప్పాడు. ముఖ్యమంత్రి స్పందిస్తే తమ కుటుంబానికే కాకుండా, ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వేలాది మంది ఉపాధ్యాయులకు కూడా ఉపశమనం లభిస్తుందని ఆ కుటుంబం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa